హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ‘మా పాలనలో ఖాదీ ఉత్పత్తుల ఎగుమతులు పెరిగాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఖాదీ పరిశ్రమ తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. ఖాదీకి పూర్వ పూర్వవైభవం తీసుకొస్తున్నాం’.. ఇటీవల గుజరాత్లోని సబర్మతి ఆశ్రమంలో నిర్వహించిన ఖాదీ ఉత్సవ్లో ప్రధాని జబ్బలు చరుచుకొంటూ చెప్పిన మాటలివి. కానీ వాస్తవ పరిస్థితికి ఆయన మాటలు పూర్తి భిన్నంగా ఉన్నాయని స్వయానా కేంద్రప్రభుత్వమే వెల్లడించిన గణాంకాలతో తేలిపోయింది. అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం సమాచార హక్కు చట్టం కింద ఖాదీ ఉత్పత్తులు, ఎగుమతులకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలని సెంట్రల్ డైరెక్టరేట్ ఆఫ్ ఖాదీ శాఖకు దరఖాస్తు సమర్పించింది. ఆ డైరెక్టరేట్ వెల్లడించిన గణాంకాలు.. గడిచిన ఐదేండ్లలో ఖాదీ ఉత్పత్తుల ఎగుమతులు పెరగడం ఏమో కానీ ఏటికేడు గణనీయంగా తగ్గిపోతుండటం గమనార్హం.
జీఎస్టీ వల్లే తగ్గుదల..
బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఖాదీ పరిశ్రమను అనేక విధాలుగా దెబ్బతీస్తూనే ఉన్నది. ఆలిండియా హ్యాండ్లూమ్ బోర్డును రద్దు చేయడంతోపాటు అనేక నిర్ణయాలు చేనేత పరిశ్రమను మరింత సంక్షోభంలోకి నెట్టాయి. ముఖ్యంగా బీజేపీ సర్కారు 2017 నుంచి 5% జీఎస్టీని విధించడం చేనేతకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నది. ఇది ఏకంగా చేనేత ఎగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. తద్వారా కార్మికుల ఉపాధి దెబ్బతింటున్నది. 2017 ముందు చేనేత ఉత్పత్తులు పెరిగాయి. జీఎస్టీ ప్రవేశపెట్టాక క్రమంగా ఎగుమతులు పడిపోతున్నాయి. 2012-13 ఆర్థిక సంవత్సరంలో రూ.281.2 కోట్ల విలువైన చేనేత ఉత్పత్తులు ఎగుమతి కాగా, ఎనిమిదేండ్ల బీజేపీ పాలన కాలంలో నేటికీ ఆ ఎగుమతుల మారును దాటలేకపోవడం గమనార్హం.
మగ్గాలపై తప్పుడు లెక్కలు
చేనేత పరిశ్రమ విషయంలో కేంద్రం తప్పుడు లెక్కలు చెప్తున్నది. నాల్గో జాతీయ సెన్సస్ ప్రకారం తెలంగాణలో 11,544 మగ్గాలు మాత్రమే ఉన్నాయని లెక్కచూపింది. కానీ వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో సుమారు 19 వేల చేనేత మగ్గాలను గుర్తించింది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో జియో ట్యాగింగ్ చేసింది. దీన్నిబట్టి కేంద్రం చెప్పే లెకలు ఎంత తప్పుల తడకగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కేంద్రం తెచ్చిన జీఎస్టీ విధానం చేనేత రంగానికి శాపంగా మారింది. చేనేత ఉత్పత్తి, ఎగుమతులు రోజురోజుకూ పడిపోతున్నాయి. ఆ వాస్తవాలు కేంద్ర గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ఇప్పటికైనా చేనేతపై జీఎస్టీని తొలగించి చేనేత రంగానికి ఊతమివ్వాలి.
– యర్రమాద వెంకన్న, అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు