కమాన్బజార్, ఫిబ్రవరి 7: రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టులను కృష్ణా రిజర్వాయర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బుధవారం ఆయన ఖమ్మం నగరానికి వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. నదీ జలాల కేటాయింపుల సమస్యకు శాస్త్రీయ పరిష్కారం అవసరమని సూచించారు.
ఆంధ్రా, తెలంగాణ మధ్య కృష్ణా జలాల సమస్యను ఆసరా తీసుకుని కేంద్రంలోని బీజేపీ లబ్ధిపొందాలని చూస్తున్నదని విమర్శించారు. బీజేపీ రెండు రాష్ర్టాల ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నదని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ర్టాల మధ్య తగవులు పెడుతున్నదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా ప్రజాసంఘాలు ఈ నెల 16న దేశవ్యాప్తంగా బంద్ చేపడుతున్నాయని, కార్మికులు, మైనార్టీ వర్గాలు బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.