వీర్నపల్లి/సిరికొండ, మార్చి 16: రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాల్లో శనివారం వడగండ్ల వాన కురిసింది.చాలాచోట్ల పంటలు దెబ్బతిన్నట్టు రైతులు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవిపదిర, వన్పల్లి, గర్జనపల్లి, మద్దిమల్లలో వడగండ్ల వాన సుమారు గంటపాటు ఏకధాటిగా కురిసింది.
నిజామాబాద్ జిల్లా సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి, డిచ్పల్లి తదితర మండలాల్లో వడగండ్లు కురిశాయి. వడగండ్ల వాన సృష్టించిన బీభత్సానికి కోతకొచ్చిన వరి నేలవాలింది. రాళ్ల వాన ధాటికి ధాన్యం గింజలు రాలిపోయాయి. చేతికొచ్చిన పంటలు నష్టపోయిన రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షానికి నష్టపోయిన తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.