నాగర్కర్నూల్ : రానున్న రోజుల్లో నాగర్ కర్నూల్(Nagar Kurnool) పార్లమెంట్ స్థానం నుంచి స్థానికుడు అయిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను(RS Praveen kumar) గెలుపించుకుందామని, వలస వాదిని అయిన మల్లురవిని తరిమి కొడదామని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు(Guvvala Balaraju) అన్నారు. శుక్రవారం పట్టణంలోని బీకే ప్యాలెస్ ఫంక్షన్ హాలులో జరిగిన అచ్చంపేట నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కలిసి ప్రసంగించారు.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి నేటికీ వంద రోజులు పూర్తి అయిన రుణమాఫీ చేయలేదన్నారు. ఇది పేదల కాంగ్రెస్ పార్టీ కాదని, రైతులను మోసం చేసే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టి బనాయిస్తే విషయం తెలిసిన మరుక్షణమే పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగుతామని హెచ్చరించారు.
అనంతరం బల్మూరు మండలం మైలారం వద్ద అక్రమ మైనింగ్ ని అడ్డుకునేందుకు వెళ్లిన గువ్వల బాలరాజు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను వంటిమామిడి సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకుడు రంగినేని అభిలాష్ రావు, మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్, స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.