హైదరాబాద్ : చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సీఎం కేసీఆర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో బుధవారం ఆయన మాట్లాడుతూ.. మంచి పనులను ఆస్వాదించే నైజం ప్రతిపక్షాలకు లేదన్నారు. ఇప్పటికే లక్షా ముప్పై మూడు వేల ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసిందన్నారు. యువతను తమ పార్టీలవైపు ఆకర్షించుకొని రాజకీయ పబ్బంగడుపుకునేందుకు ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాయన్నారు. రాజకీయ నిరుద్యోగులు, పార్టీల మాటలను యువత పట్టించుకోవద్దని, ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అచ్చంపేట నిరుద్యోగ యువత కోసం సొంత ఖర్చులతో భోజన, వసతి సౌకర్యాలు కల్పించి కోచింగ్ ఇప్పిస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.