హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): నోరుజారటమే రాజకీయం అనుకోవడం పొరపాటని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు. రాజకీయాల్లో పెడధోరణులు వస్తున్నాయని, అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. బట్టకాల్చి మీదేయటం పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి అలావాటుగా మారిందని మండిపడ్డారు. కొందరు నాయకులు నోరుజారటమే రాజకీయం అనుకుంటున్నారని, అది సరైన పద్ధతి కాదని హితవుపలికారు. తాను జీవితాంతం సీఎం కేసీఆర్తోనే ఉంటానని చెప్పారు. తన కుమారుడికి ఇంకా వయస్సు ఉన్నదని అవకాశం వస్తే పోటీచేద్దాం అనుకున్నమాట వాస్తవమే అయినా సేవ చేయటానికి అనేక మార్గాలున్నాయని తెలిపారు. తమ ట్రస్ట్ ద్వారా ప్రజాసేవ చేస్తాడని పేర్కొన్నారు. శుక్రవారం శాసనమండలిలో తన చాంబర్లో గుత్తా మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
ఇటీవల రాజస్థాన్లోని ఉదయ్పూర్లో కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) సదస్సుకు ఆయన హాజరైన విశేషాలను ఈ సందర్భంగా చెప్పారు. చట్టసభల రికార్డుల డిజిటలైజేషన్, ప్రజాస్వామ్య పరిరక్షణకు చట్టసభలు అనుసరించాల్సిన వ్యూహాలపై ఉదయ్పూర్లో సుదీర్ఘ చర్చ జరిగిందని చెప్పారు. సెప్టెంబర్ చివరివారం నుంచి అక్టోబర్ మొదటివారంలో సీపీఏ సదస్సు ఘనా దేశంలో నిర్వహించనున్నారని చెప్పారు. ఎన్నికల్లో పోటీచేసి ప్రజాప్రతినిధిగా కొనసాగితే ప్రజాసేవ చేయాలని లేదని, ప్రజాప్రతినిధి కాకపోయినా సేవ చేయాలనే ఆలోచనతో తన కుమారుడు అమిత్రెడ్డి ఉన్నారని చెప్పారు. తాను ప్రత్యక్ష రాజకీయాలు వద్దనే పరోక్ష రాజకీయాల వైపు వచ్చానని, తాను జీవితాంతం సీఎం కేసీఆర్ వెంటే ఉంటానని, అధిష్ఠానానికి నచ్చకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని వెల్లడించారు. తనకు, లేదా తన కుమారుడికి సీఎం కేసీఆర్ అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తామని చెప్పారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో 12కి 12 సీట్లను బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ 2014, 2018 ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తులేకుండా ఒంటరిగా పోటీచేసిన విషయాన్ని గుత్తా సుఖేందర్రెడ్డి గుర్తుచేశారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కూటమికి, కాంగ్రెస్ కూటమికి సమాన దూరంలో ఉంటుందని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించారని, ఈ క్రమంలో మిత్రబేధం వంటి అంశాలు అప్రస్తుతమని చెప్పారు. కమ్యూనిస్టులతో పొత్తు ఉంటే బాగుంటుందనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు.