నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఆధిపత్యం కోసం, వనరులను దోచుకొనేందుకు మరోసారి సమైక్యవాదులు కుట్రలు చేస్తున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ఇటీవలి పరిణామాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కేవీపీ రామచందర్రావు, షర్మిల, రేణుకాచౌదరి మాటల్లోని ఆంతర్యాన్ని ప్రజలు అర్థం చేసుకువాలని కోరారు. సోమవారం నల్లగొండలోని తన నివాసంలో గుత్తా సుఖేందర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. 1969 కంటే ముందు నుంచి తెలంగాణను దోచుకున్న వాళ్లంతా తిరిగి మరోసారి ఒక్కటవుతున్నారని, తెలంగాణలో పాగా వేయాలని కుట్రలు, దురాలోచనలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్వాళ్లు ఏర్పాటు చేసిన ‘రైతే రాజు’ పుస్తకావిష్కరణలో కేవీపీ మాటలను అందరూ గమనించాలని కోరారు. తాను తెలంగాణ వ్యక్తిని అంటూ ఇక్కడి మట్టిలోనే కలిసిపోవాలని ఉందనడంలోనే పెద్ద కుట్ర దాగి ఉన్నదని తెలిపారు. 2009 డిసెంబర్ ప్రకటన సమయంలో తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు పన్నడంలో కేవీపీదే కీలక పాత్ర అని గుర్తుచేశారు. వైఎస్ హయాంలోనూ తెలంగాణ పట్ల చిన్నచూపు ప్రదర్శించారని తెలిపారు. వైఎస్ కూతురు షర్మిల తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తాననడం పెద్ద జోక్ అని వ్యాఖ్యానించారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో రాజన్న పాలన కంటే వంద రెట్లు ఎక్కువ అభివృద్ధి జరిగిందని గుత్తా సుఖేందర్రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజలు, అన్నదాతలు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారన్న విషయం గమనించాలని అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన కుటుంబం నుంచి వచ్చిన షర్మిల.. అవినీతి గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. ఆంధ్రలో రాజకీయాలు చేతకాక ఇక్కడ ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోబోరని హెచ్చరించారు. కిరాయి మనుషులతో పాదయాత్ర చేసినంత మాత్రాన ప్రజలు నమ్మబోరని అన్నారు. తెలంగాణలోని వనరులపై కన్నేసి ఇక్కడ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘తెలంగాణ బిడ్డ’ను అంటూ మాట్లాడుతున్న రేణుకా చౌదరి.. ఎందుకు పోతిరెడ్డిపాడు నీటి దోపిడీపై మాట్లాడడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్లో ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్నారని విమర్శించారు. కేవీపీ, షర్మిల, రేణుకాచౌదరి ప్రకటనలు దండయాత్రను తలపిస్తున్నాయని పేర్కొన్నారు.