నల్లగొండ ప్రతినిధి, మే 30 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను ప్రతిపక్షాలు ఓర్చుకోలేక, విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ పాలన దేశానికే తలమానికంగా, దిక్సూచిగా సాగుతున్నదని అన్నారు. ప్రతిపక్ష నేతల మాటల్లో ద్వేషం తప్ప సలహాలు, సూచనలు ఏమీ ఉండటం లేదని చెప్పారు. మంగళవారం ఆయన నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కనీస విజ్ఞత లేకుండా దశాబ్ది వేడుకలపై కాంగ్రెస్, బీజేపీ రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.
అధికారంపై కాంగ్రెస్, బీజేపీ నేతలు పగటికలలు కంటున్నారని, వారి కలలు మరోసారి కల్లలు కాకతప్పదని జోస్యం చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం సుభిక్షంగా, సురక్షితంగా ఉంటుందన్న బలమైన నమ్మకంతో రాష్ట్ర ప్రజలు ఉన్నారని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు తొమ్మిదేండ్లలోనే అమలవుతున్నాయని, ప్రతి ఇంటికీ ఏదో ఒక పథకం అందుతున్నదని చెప్పారు. వ్యవసాయానికి సాగునీరు, ప్రతి కుటుంబానికి తాగడానికి సురక్షిత మంచినీరు ఏ రాష్ట్రంలోనూ ఇప్పటికీ అమలు కావడం లేదని అన్నారు. కేంద్రం సహకరించకపోయినా రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరుపుతూ రైతులకు అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్సేనని చెప్పారు.
సకల జనుల సంతోషం
కేసీఆర్ పాలనలోనే సకల జనులు సంతోషంగా ఉన్నారని మండలి చైర్మన్ గుత్తా తెలిపారు. పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయని, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను సైతం క్రమబద్ధీకరించిన చరిత్ర తెలంగాణ ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, జీతభత్యాల విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. దశాబ్ది ఉత్సవాలపై కాంగ్రెస్ నేతలు రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యలు వారి తెలివి తక్కువతనానికి నిదర్శనమని మండిపడ్డారు.