నల్లగొండ, అక్టోబర్ 26 : దళితబంధు, రైతు బంధు పథకాలను ఎన్నికలను సాకుగా చూపి ఆపాలని కాంగ్రెస్ నేతలు సీఈసీకి ఫిర్యాదు చేయడాన్ని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తీవ్రంగా ఖండించారు.
గురువారం ఆయన నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. రైతుబంధు పథకం గత ఎన్నికల ముందు నుంచే అమలవుతూ ఇప్పటివరకు పది దఫాలుగా రూ.73 వేల కోట్లను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని అన్నారు. దళితబంధు ఇప్పటికే మొదలై ఒక విడత పూర్తి కాగా, రెండో విడత ఇస్తున్నట్టు చెప్పారు. రైతులు, దళితుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను ఆపాలనే కుట్ర చేసి వారి నోట్లో మట్టి కొట్టడం సరికాదన్నారు. రైతులు, ఈ పథకాలను ఆపితే ఆయా వర్గాలకు ఎంతో అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.