నల్లగొండ: ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కేంద్రం చేతులెత్తేయడంతో తెలంగాణలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. బ్యాంకులను, ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ ప్రధాని మోదీ అన్ని సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డితో కలిసి నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మే విధానాలను బీజేపీ ప్రభుత్వం విడనాడాలని సూచించారు.
ప్రజలపై భారంమోపుతూ పేదరికాన్ని పెంచుతున్న కేంద్రం తీరు బాధాకరమన్నారు. మోదీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు.
రూ.16 లక్షల కోట్ల లాభాల్లో వున్న బ్యాంకులను అమ్మడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, దుర్మార్గపు విధానాలతో దేశాన్ని అంబానీలకు, ఆదానిలకు అమ్ముతున్నాదని దుయ్యబట్టారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాటలు వింటుంటే నవ్వు వస్తున్నదని ఎద్దేవా చేశారు. నేల విడిచి సాము చేస్తున్న రేవంత్కు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. దిగజారి రాజకీయాలు చేస్తున్న పీసీసీ అధ్యక్షుడికి ప్రజలు బహిష్కరించే రోజు త్వరలోనే వస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణగా మారుస్తున్నారని, ఆయనపై అడ్డగోలిగా మాట్లాడడం తగదన్నారు.
రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరులేని విజయం సాధించిందని, దీనిద్వారా సీఎం కేసీఆర్పై ప్రజలు, ప్రజాప్రతినిధుల్లో ఉన్న విశ్వసం మరో సారి రుజువైందని చెప్పారు. నల్లగొండలో కోటిరెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.