నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తనయుడు, బీఆర్ఎస్ నేత గుత్తా అమిత్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం ఆయన తన బాబాయి, మదర్ డెయిరీ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్రెడ్డితోపాటు మరికొందరితో కలసి సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అంతకుముందు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కలిసి జూబ్లీహిల్స్లోని అమిత్రెడ్డి నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్లో చేరితే సముచిత స్థానం కల్పిస్తామని అమిత్రెడ్డికి హామీ ఇచ్చారు. అనంతరం ఆయన రేవంత్రెడ్డి నివాసానికి వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వాస్తవానికి అమిత్రెడ్డి ఇటీవల బీఆర్ఎస్ నుంచి ఎంపీ టికెట్ ఆశించారు. అదే సమయంలో కాంగ్రెస్ టికెట్ కోసం మంత్రి కోమటిరెడ్డితోపాటు వేం నరేందర్రెడ్డిని కలువడం చర్చనీయాంశంగా మారింది. చివరకు కాంగ్రెస్ టికెట్ రాకపోయినా ఆయన ఆ పార్టీలో చేరడం గమనార్హం.