నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల తర్వాతనైనా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిపై పునరాలోచన అవసరమని, సంస్థాగత నిర్మాణమే ఏ పార్టీ పటిష్టతకైనా పునాది అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అభిప్రాయపడ్డారు. నల్లగొండ జిల్లా చిట్యా ల మండలం ఉరుమడ్లలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలపై న్యాయపరంగా, చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యల మీద దృష్టి సారించామని తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో గతంలో తీసుకున్న నిర్ణయాలను, పూర్తి అంశాలను పరిగణలోకి తీసుకుని తదుపరి చర్యలు చేపడతామని చెప్పారు. తన కుమారుడు అమిత్రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకొన్నాడని స్పష్టం చేశారు. కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు తన కుమారుడికి టికెట్ ఇస్తామని, పోటీలో ఉండాలని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.
మీడియా చేస్తున్న ప్రచారమే తప్ప గుత్తా సుఖేందర్రెడ్డి మాటల్లో పెద్దగా సంచలనాలేవీ లేవని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. నార్కట్పల్లిలోని ఓ హోటల్లో గుత్తా వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు జగదీశ్రెడ్డి స్పందించారు. తనపై గుత్తా వ్యక్తిగతంగా కామెంట్స్ చేసినట్టుగా ఎక్కడా కనపడలేదని, సుఖేందర్రెడ్డి చాలా సీనియర్ నాయకుడని, అందుకే కేసీఆర్ మండలి చైర్మన్గా నియమించనట్టు తాను భావిస్తున్నానని చెప్పారు. ఆయన పార్టీ నిర్మాణంపై చేసిన సూచనలపైనా ఆలోచన చేస్తామని, ఎంపీ ఎన్నికల తర్వాత పార్టీ నిర్మాణం విషయంలో వారి సేవలు వినియోగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారని, అవసరమైతే సుఖేందర్రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేస్తామని చెప్పారు.