నల్లగొండ: ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అన్నిటిని రాజకీయ కోణంలో విమర్శించడం సమంజసం కాదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును స్వాగతిస్తున్నానని చెప్పారు. నల్లగొండలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ ప్రధాని వాజ్పేయి ప్రభుత్వ హయాంలోనే నదుల ప్రక్షాళనకు అడుగు పడిందన్నారు. కేసీఆర్ కూడా రివర్ ఫ్రంట్ పేరుతో ప్రణాళిక తీసుకొచ్చారని తెలిపారు. గత ప్రభుత్వాలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని చెప్పారు.
మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల కోసం నందనవనంలో గతంలోనే వేయికి పైగా ఇండ్లు నిర్మించి ఇచ్చారని గుర్తుచేశారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా ఏదో చేస్తున్నట్టు వ్యతిరేక ప్రచారం చేయడం సరైనది కాదని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైతులు వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారని వెల్లడించారు. అవసరమైతే మూసీ ప్రక్షాళన కోసం ఉద్యమానికి దిగాలన్నారు.