నల్లగొండ, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మునుగోడులో ఉపఎన్నిక ఎప్పుడు వచ్చినా అధికార పార్టీ టీఆర్ఎస్దే విజయమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి స్పష్టంచేశారు. రెండోస్థానం కోసమే కాంగ్రెస్, బీజేపీలు పోటీపడుతున్నాయని ఆయన చెప్పారు. మంగళవారం నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడారు. రాష్ర్టాభివృద్ధిని ఆటంకపర్చడంతోపాటు సీఎం కేసీఆర్ ఆలోచనలను అడ్డుకోవడం కోసమే బీజేపీ ఉపఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేసిందని ఆయన విమర్శించారు.
బీజేపీ రాజకీయ అవసరానికి తోడు రాజగోపాల్రెడ్డి కాంట్రాక్టులు కూడా రాజీనామా అంశంలో ఇమిడి ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ధరల పెరుగుదల, కేంద్ర ప్రభుత్వ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే.. మోదీ, అమిత్షా కలిసి ఉపఎన్నికలతో రాష్ర్టాల్లో అనిశ్చిత, అనైతిక వాతావరణం సృష్టిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వాటిల్లో మునుగోడు ఉప ఎన్నిక కూడా ఒకటన్నారు. మునుగోడు అభివృద్ధి కోసమే తన రాజీనామా అని రాజగో పాల్రెడ్డి చెప్పడం శుద్ధ అబద్ధమని, అలాంటప్పుడు గతంలో ఐదేండ్లు ఎంపీగా, మూడేండ్లు ఎమ్మెల్సీగా పని చేసినప్పుడు అభివృద్ధి గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. ‘కేసీఆర్ది కుటుంబ పాలన అంటూ రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉంది.
కాంగ్రెస్లో పనిచేసినప్పుడు నెహ్రూ, ఇందిర, రాజీవ్, సోనియా, రాహుల్గాంధీలది కుటుంబ పాలనగా కన్పించలేదా? కోమటిరెడ్డి కుటుంబంలో అన్న ఎంపీ, తమ్ముడు ఎమ్మెల్యేగా ఉండగా, ఇంకో సోదరుడు ఎమ్మెల్సీగా, రాజగోపాల్రెడ్డి భార్య ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటమి చెందడం కుటుంబ రాజకీయాల కిందకు రాదా..?’ అని గుత్తా ప్రశ్నించారు. రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వెంట 25శాతం మంది కార్యకర్తలు కూడా కాంగ్రెస్ను వీడి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదని తెలిపారు. మునుగోడు ఉపఎన్నికలో రాజగోపాల్రెడ్డి మునగడం ఖాయమని తేల్చిచెప్పారు. రేవంత్రెడ్డి, బండి సంజయ్ లాంటి వాళ్లతో రాష్ర్టానికి ఎప్పటికైనా ముప్పేనన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపికపై అధినేత కేసీఆర్ అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.