హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి రెండోసారి మండలి చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని సోమవారం మండలి అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు. అనంతరం గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలంగాణ శాసనమండలికి 2021లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా రెండోసారి నవంబర్ 22న ఎన్నికయ్యారు.
నల్లగొండ జిల్లా ఊరుమడ్ల గ్రామంలో 1954, ఫిబ్రవరి 2న జన్మించిన గుత్తా సుఖేందర్ రెడ్డి.. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. 1977, మే 1న అరుంధతితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
గుత్తా సుఖేందర్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని కమ్యూనిస్టు పార్టీ నుంచి ప్రారంభించారు. కమ్యూనిస్టు పార్టీలో చురుకుగా పని చేసిన ఆయన.. అంచెలంచెలుగా ఎదిగారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో పని చేశారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున అదే నియోజకవర్గం నుంచి మళ్లీ ఎంపీగా విజయం సాధించారు. 2014 జనరల్ ఎలక్షన్స్లోనూ ఎంపీగా గెలుపొంది.. 2016, జూన్ 15న టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో గుత్తాను సీఎం కేసీఆర్ రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. 2019, ఆగస్టులో ఎమ్మెల్యే కోటాలో తొలిసారిగా మండలికి ఎన్నికయ్యారు. ఈ క్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 2019, సెప్టెంబర్ 11న మండలి చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. 2021, జూన్ 3న గుత్తా సుఖేందర్ రెడ్డి పదవీకాలం ముగిసింది. 2021, నవంబర్లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో రెండోసారి ఆయనను మండలి చైర్మన్ పదవి వరించింది.