సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఘర్షణ, అంతర్గత సమస్యలు లేకుండా భట్టి పాదయాత్ర జరగడం లేదని.. ఆయనది ఆయనది కలహాల పాదయాత్ర అని విమర్శించారు. భట్టి పాదయాత్రలో కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకుంటున్నారని అన్నారు. నల్లగొండ జిల్లాపై భట్టి విక్రమార్కకు అవగాహన లేదని అన్నారు. జలయజ్ఞం పేరుతో కాంగ్రెస్ మొదలుపెట్టిన ప్రాజెక్టులను సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో పూర్తి చేసి నీళ్లు అందిస్తున్నారని తెలిపారు.
భట్టి విక్రమార్క పాదయాత్రను ప్రజలు పట్టించుకోవడం లేదని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. భట్టి రోజుకు మూడు కిలోమీటర్లు నడుస్తున్నారని.. అసలు ఇదేమీ పాదయాత్ర అని ప్రశ్నించారు. భట్టి పాదయాత్ర నల్లగొండ దాటేది లేదని ఎద్దేవా చేశారు. అబద్ధాలు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాంగ్రెస్ నేతల పని అని విమర్శించారు. బీజేపీ అభివృద్ది నిరోధకులు అని.. అభివృద్ధిని చూసి బీజేపీ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ఇక తాను బీఆర్ఎస్లోకి ఎందుకు వచ్చాననేది కూడా ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి వివరించారు. చంద్రబాబు ఎంపీ టికెట్ ఇవ్వనందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్లో చేరానని తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, గ్రూపు రాజకీయాలు చూడలేక బీఆర్ఎస్లోకి వెళ్లానని స్పష్టం చేశారు.