నల్లగొండ: ప్రధాని మోదీ (PM Modi) పాలమూరు (Palamur) పర్యటనకు వచ్చిన ప్రతిసారి మొండి చెయ్యి ఇచ్చిపోతారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) విమర్శించారు. ప్రధాని పర్యటన వల్ల తెలంగాణకు (Telangana) ఒరిగేదేమీ లేదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వరని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరి ఇవ్వరు, మిషన్ కాకతీయకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. తెలంగాణపై మాత్రం అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నల్లగొండలోని తన నివాసంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు మోదీ ఒక్క పైసా ఇవ్వరని, కనీసం పాలమూరు ప్రాజెక్టుకైనా జాతీయ హోదా (National Status) ఇవ్వాలన్నారు.
గవర్నర్ ఏవేవో మాట్లాడుతున్నారని, ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గవర్నర్ తమిళిసైపై ఎవ్వరు రాళ్లు వేయడం లేదని, ఆమె ఆవేదన ఏమిటో అర్థం కావడంలేదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నల్లగొండ (Nalgonda) జిల్లాలో ఊహించని విధంగా అభివృద్ధి జరిగిందన్నారు. సోమవారం మంత్రి కేటీఆర్ జిల్లాలో పర్యటిస్తున్నారని తెలిపారు. జిల్లా కేంద్రంలో ఐటీ హబ్ను ప్రారంభిస్తారని, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని వెల్లడించారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకంలో అందమైన జిల్లా కేంద్రంగా నల్లగొండ పట్టణం మారిందన్నారు. కేసీఆర్, కేటీఆర్ కృషివల్లే ఇంత అభివృద్ధి జరిగిందన్నారు. పీసీసీ అధ్యక్షుడు సహా కాంగ్రెస్ నాయకులకు మతిభ్రమించిందని ఎద్దేవా చేశారు. అభివృద్ధి అంటేనే బీఆర్ఎస్ అన్నారు.