నల్లగొండ ప్రతినిధి, మే 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తూ కక్షసాధింపు చర్యలకు పాల్పడటం ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగించడమేనని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ర్టాలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్రం ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. ఆ రెండు జాతీయ పార్టీలకు ఎలాంటి ఎజెండా లేదని, అధికారమే ఎజెండాగా నోరు పెట్టుకొని తిరుగుతూ రాష్ర్టాన్ని దోచుకోవాలని కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.
బీజేపీ రాష్ట్ర నాయకులు తెలంగాణ పరువు పోయేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండటం వల్లనే రాష్ట్రంలో అన్నివర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు కులాలు, మతాల పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. సమైక్య పాలనలో ఒకరిద్దరు మాత్రమే తెలంగాణ నుంచి సీఎంలు అయ్యారని, మిగిలిన వారంతా ఆంధ్రా వాళ్లు కావడంతో నాబార్డు రుణాలు వాళ్లే తీసుకెళ్లారని గుర్తుచేశారు.
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినందునే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతున్నదని, లేదంటే తెలంగాణ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా అయ్యేదని పేర్కొన్నారు. కేసీఆర్ కృషి వల్లనే తెలంగాణ ఇప్పుడు దేశానికి రోల్ మోడల్గా నిలుస్తున్నదని స్పష్టంచేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన హెటిరో ఫార్మా అధినేత పార్థసారథిరెడ్డి అనేక దేశాల్లో కంపెనీలు పెట్టి రాష్ట్రం పేరు నిలపెట్టారని, అలాంటి వ్యక్తికి రాజ్యసభ టికెట్ ఇవ్వడమంటే మన పారిశ్రామికవేత్తలకు గౌరవం ఇచ్చినట్టేనని అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. గురువారం రాష్ర్టానికి వస్తున్న ప్రధాని మోదీ.. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చే విధంగా ఆలోచించాలని కోరారు.