హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఆదివారం ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రంగారెడ్డి జిల్లా కొత్తూరు గిరిజన గురుకుల విద్యార్థులు పేరిణి శివతాండవంను ప్రదర్శించనున్నారు. ఇప్పటికే బెంగళూరులో నిర్వహించిన దక్షిణభారత జోనల్ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులు.. ఢిల్లీలో నిర్వహించే మెగా ఫైనల్లో నృత్యప్రదర్శన ఇవ్వనున్నారు. కాకతీయుల కాలం నాటి వీరరౌద్రరస ప్రధానంగా రూపొందించిన పేరిణి శివతాండవంను 10 మంది విద్యార్థులు ప్రదర్శించబోతున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ మామిడి నారాయణ తెలిపారు. పోటీలలో విజేతలుగా నిలిచినవారికి వచ్చే రిపబ్లిక్ పరేడ్లో పాల్గొనే అరుదైన అవకాశం లభిస్తుందని ఆయన చెప్పారు.