భువనగిరి అర్బన్/భూదాన్పోచంపల్లి, ఏప్రిల్ 16: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్సీ గురుకుల పాఠశాల హాస్టల్లో ఫుడ్పాయిజన్కు గురై చికిత్స పొందుతున్న విద్యార్థి మృతి చెందాడు. హైదరాబాద్లోని రెయిన్బో దవాఖానలో ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి మంగళవారం ప్రాణాలు విడిచాడు.
బాలుడి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. భువనగిరి పట్టణ పరిధిలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో సీహెచ్ ప్రశాంత్ (12) ఆరో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 11న రాత్రి హాస్టల్లో ఫుడ్పాయిజన్ కావడంతో ఇప్పటివరకు 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మొదటగా 10 మందిని మెరుగైన చికిత్స కోసం భువనగిరి ఏరియా దవాఖానకు తరలించి ఆరుగురికి అక్కడే చికిత్స కొనసాగించారు.
పరిస్థితి విషమించిన నలుగురు విద్యార్థుల్లో ఇద్దరిని ఉస్మానియా దవాఖానకు, మరో ఇద్దరిని హైదరాబాద్లోని మిరాకిల్ దవాఖానకు తరలించారు. మిరాకిల్ దవాఖానలో చికిత్స పొందుతున్న సీహెచ్ ప్రశాంత్ పరిస్థితి మరింత విషమంగా ఉండటంతో గత శనివారం బంజారాహిల్స్లోని రెయిన్బో దవాఖానకు తరలించారు. అప్పటి నుంచి అక్కడే వెంటిలేటర్పై చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతున్నాడు.
ప్రశాంత్ ఆరోగ్యం మరింత క్షీణించి మంగళవారం సాయంత్రం మృత్యువాతపడ్డాడని మృతుని మేనమామ సురేశ్ తెలిపారు. ప్రస్తుతం మృతదేహం హైదరాబాద్లోని రెయిన్బో దవాఖానలోనే ఉన్నట్టు ప్రశాంత్ కుటుంబ సభ్యులు చెప్పారు. పాఠశాలలో ఇప్పటివరకు మొత్తం 28 మంది అస్వస్థతకు గురికాగా.. భువనగిరి ఏరియా దవాఖానలో ఇంకా ఐదుగురు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. 22 మంది డిశ్చార్జ్ అయ్యారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన రోజు నుంచి గుట్టుచప్పుడు కాకుండా అధికారులు చికిత్స చేయించే ప్రయత్నం చేశారని ఆరోపణలు వస్తున్నాయి.
పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
భూదాన్పోచంపల్లి మండలం జిబ్లక్పల్లికి చెందిన చిన్నలచ్చి మహేశ్, పారిజాత దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. మహేశ్ బోర్ బండి డ్రైవర్గా, పారిజాత కూలిపని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారి పెద్ద కుమారుడు ప్రశాంత్ గురుకుల పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. విద్యాభ్యాసం కోసం గురుకులానికి వచ్చి కలుషితమైన ఆహారం తిని విద్యార్థి నిండు ప్రాణాలు బలైన ఘటన జిల్లాలో కలకలం రేపింది.
ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న తమ కొడుకు ప్రశాంత్కు మెరుగైన వైద్యసేవలు అందించేలా హాస్టల్ నిర్వాహకులు పట్టించుకోలేదని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల కోడ్ పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారని వాపోయారు. ప్రశాంత్ కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించడంతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ప్రిన్సిపాల్పై సస్పెన్షన్ వేటు
గురుకుల పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై హాస్టల్ ప్రిన్సిపాల్ శ్రీరామ్ శ్రీనివాస్ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఎస్సీ గురుకుల సెక్రటరీ సీతాలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. ఫుడ్పాయిజన్ ఘటన నేపథ్యంలో ఈ నెల 14న ఉన్నతధికారులు విచారణ కమిటీని నియమించారు. కమిటీ సభ్యులు సోమవారం గురుకుల పాఠశాలలో విచారణ చేపట్టారు. అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. నివేదిక ఆధారంగా ప్రిన్సిపాల్ పై సస్పెన్షన్ వేటు వేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.