జమ్మికుంట, సెప్టెంబర్ 9: ‘దేశంలో కోట్లాదిమంది ప్రైవేట్ టీచర్లు ఉన్నారు. వీరు చాలీచాలని వేతనాలతో బతుకులు వెళ్లదీస్తున్నారు. ప్రైవేట్ టీచర్ల సంరక్షణ చట్టం కోసం ఉద్యమిస్తా. ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఒత్తిడి తెస్తా’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ అన్నా రు. తాను ఎంపీగా ఉన్న కాలంలో ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించానని, ఇప్పు డు వారి అభ్యున్నతి కోసం పోరాటం చేస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్లో లక్ష మంది టీచర్లతో సమావేశం నిర్వహించి సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. శనివారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ట్రస్మా ఆధ్వర్యంలో గురుపూజోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన వినోద్కుమార్ మాట్లాడుతూ.. చాలీచాలనీ వేతనాలతో జీవనం కొనసాగిస్తున్న ఉపాధ్యాయులకు రాష్ట్ర సర్కారు అండగా ఉంటుందని చెప్పారు. టీచర్లను కంటికి రెప్పలా కాపాడుకుంటామని స్పష్టం చేశారు.
కరోనా సమయంలో ఉపాధ్యాయలకు అందించిన సాయాన్ని గుర్తుచేశారు. ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులకు ఇబ్బందులున్నాయని, వాహనాల ట్యాక్సీ మాఫీ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ వస్తే చీకటేనని నాటి సీఎం కిరణ్కుమార్రెడ్డి అన్నారని, 24 గంటల విద్యుత్తు అందిస్తున్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. గ్రామాల్లో కరెంటు ఉండటం లేదని బీజేపీ ఎమ్మెల్యే అనడం హాస్యాస్పదమని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాత్రి పూట రైతులు పొలాల వద్దకు పోతున్నారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న ఏ విద్యుత్తు తీగనైనా ముట్టుకొని చూసి మాట్లాడాలని సూచించారు. ఎత్తిపోతల పథకాల ద్వారా అదనంగా కోటి ఎకరాలకు నీరు అందుతున్నదని తెలిపారు. ఏడుసార్లు అవకాశం ఇచ్చినా ఈటల రాజేందర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని, ఒకే ఒక్క అవకాశమిస్తే హుజూరాబాద్ను సుందరంగా తీర్చిదిద్దుతానని మండలి విప్, బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు తదితరులు పాల్గొన్నారు.