ఆస్ట్రేలియా : ఇటీవలే తెలంగాణలో బాగా ప్రాచుర్యం పొందిన ‘గులాబీల జెండాలే రామక్క’(Gulabila jendale Ramakka)పాట నేడు ఖండాలు దాటి విదేశాల్లో కూడా మారు మోగుతున్నది. నవంబర్లో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) పార్టీ గెలవాలని కాంక్షిస్తూ తమ మద్దతు తెలుపుతున్నారు. రీల్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హల్చల్ చేస్తున్నారు. సోషల్ మీడియా మొత్తం ‘గులాబీల జెండాలే’ పాట ట్రెండ్ నడుస్తుందని, అందుకే మెల్బోర్న్, బ్రిస్బేన్, సిడ్నీ నగరాల్లో వినూత్నంగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతగా అందరూ ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా(Australia) శాఖ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి తెలిపారు.
కాగా, మెల్బోర్న్లో సాహిత్య రెడ్డి అతి రద్దీ ప్రదేశమైన ఫ్లిండర్స్ స్ట్రీట్ జంక్షన్లో, బ్రిస్బేన్లో విన్నీ తుముకుంట, శ్రీవేకర్, యుగంధర్, రాకేష్ , సంతోష్, పృథ్వి , రమ్య, శిరీష బృందంతో బ్రిస్బేన్ సౌత్ బ్యాంక్లో ఈ పాటతో హల్చల్ చేశారు. ఎంతో అభివృద్ధికి నోచుకుంటున్న తెలంగాణా రాష్ట్రం మళ్లీ యాభై ఏళ్లు వెనక్కి వెళ్లకుండా ఉండాలంటే కేసీఆర్ మూడోసారి గెలువాల్సిందే అని, అందుకే రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేని మాలాంటి వాళ్లు కూడా మద్దతు తెలపడానికి ముందుకు వస్తున్నారని సాహిత్య రెడ్డి తెలిపారు.