సైదాపూర్, ఫిబ్రవరి 21: కరీంనగర్ జిల్లా గుజ్జులపల్లి శివారులోని మిడ్మానేరు ఆయకట్టు భూములకు నీళ్లు వచ్చాయి. రెండు రోజుల కిందట ‘నమస్తే తెలంగాణ’ మెయిన్ పేజీలో ‘సాగునీళ్లివ్వకుండా సంపుతరా’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన నీరందించి పంటలను కాపాడాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు ప్రాజెక్టు కుడి కాలువలో పేరుకుపోయిన తుంగ, పొదలను తొలగించారు. బుధవారం నీటి పరిమాణాన్ని పెంచి ఎండుతున్న పంట పొలాలకు మళ్లించారు. మిడ్మానేరు కుడి కాలువలో నీటి ప్రవాహన్ని ఎస్సారెస్పీ డీఈ సమ్మయ్య పరిశీలించారు. పంటలు ఎండుతున్న సమయంలో నీరందడంతో రైతులు సంతోషం వ్యక్తంచేశారు. తమ సమస్యను వెలుగులోకి తెచ్చిన ‘నమస్తే తెలంగాణ’కు కృతజ్ఞతలు తెలిపారు.