హైదరాబాద్ : స్వచ్ఛ గ్రామీణ అవార్డులు తెలంగాణకు వచ్చినంతగా గుజరాత్ రాష్ట్రానికి ఎందుకు రావడం లేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabello) ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi), కేంద్రమంత్రి అమిత్ షా(Amit shah) ను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్(Chief Minister KCR) ముందుచూపు వల్ల తెలంగాణ గ్రామాలు సంపూర్ణ అభివృద్ధిని సాధిస్తున్నాయని పేర్కొన్నారు.
ఇటీవల జాతీయ అవార్డులు(National Awards) పొందిన తెలంగాణ గ్రామాలు, మండలాలు, జిల్లా పరిషత్ ల ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ నెల 17న ఢిల్లీ లో రాష్ట్రపతి(President) చేతుల మీదుగా అవార్డులు అందుకోవడానికి వెళుతున్నారు. ఈ సందర్భంగా వారికి, హైదారాబాద్ లోని మంత్రుల నివాసంలో అల్పాహార విందు ఇచ్చి వీడ్కోలు పలికారు. ఆయన మాట్లాడుతూ సీఎం ప్రత్యేక చొరవతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయని పేర్కొన్నారు. ‘ గ్రామాల్లో అన్ని సదుపాయాలు పెరిగాయి. ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు వస్తాయని కూడా ఎవరూ ఊహించలేద’ ని వెల్లడించారు.
ఇప్పటివరకు గత మూడేళ్లలో రాష్ట్రానికి 79 అవార్డులు వచ్చాయని, ఇంకా వస్తాయని ధీమాను వ్యక్తం చేశారు. కేంద్రం సహకరిస్తే, ఇంకా అభివృద్ధికి అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ చెప్పినట్లు, అసెంబ్లీ తీర్మానం చేసిన విధంగా ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే బాగుంటుందని కేంద్రానికి సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ములుగు జిల్లా చైర్మన్ కుసుమ జగదీశ్, కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, ప్రత్యేక కమిషనర్లు ప్రసాద్, ప్రదీప్ శెట్టి , అవార్డులు పొందిన సర్పంచులు, కార్యదర్శులు, ఎంపీపీలు, డీపీవోలు తదితరులు పాల్గొన్నారు.