ఫెడరల్ స్ఫూర్తిని మంటగలుపుతూ ప్రస్తుతం కేంద్రంలో నియంతృత్వ ధోరణి ప్రబలుతున్నది. దీన్ని ఇట్లనే చూస్తూ ఊరుకోలేక, ముందుండి నడిపించే నాయకత్వం లేక మాలాంటి సీనియర్లంతా ఆందోళనతో ఉన్నాం. ఈ సందర్భంలో చీకట్లో చిరుదీపమై, మీరు (కేసీఆర్) కేంద్ర విధానాలను ప్రతిఘటిస్తున్న తీరు మావంటి సీనియర్ నాయకులను ప్రభావితం చేస్తున్నది. అనుకున్నదాన్ని సాధించేదాక పట్టిన పట్టు విడువని నాయకుడిగా మిమ్మల్ని ఇప్పటికే దేశం గుర్తించింది.
-శంకర్సింగ్ వాఘేలా
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): వర్తమాన జాతీయ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వం దేశానికి ఎంతో అవసరమని గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయవేత్త శంకర్సింగ్ వాఘేలా స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ను జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆయన ఆహ్వానించారు. సీఎం కేసీఆర్కు తన పూర్తి సంఘీభావాన్ని ప్రకటించారు. సీఎం కేసీఆర్తో కలిసి పనిచేసేందుకు ఆయన సంసిద్ధత వ్యక్తంచేశారు. మోదీ, అమిత్షాల వల్ల దేశం నాశనమవుతున్నదని వాఘేలా ఆవేదన వ్యక్తంచేశారు. దేశాన్ని బాగుచేయాలంటే దార్శనికత ఉన్న ఒక నాయకుడు అవసరమని, ఆ ముందు నడిచే నాయకుడు మీరే కావాలని ఆయన సీఎం కేసీఆర్తో అన్నారు. ఈ సంక్షోభ పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించగల శక్తి, వ్యూహం కేసీఆర్కే ఉన్నదని ఆయన తేల్చిచెప్పారు. ఇది తనొక్కడి అభిప్రాయం కాదని, ఎంతోమంది సీనియర్ల నిశ్చితాభిప్రాయమని ఆయన విస్పష్టం చేశారు. జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ క్రియాశీలక పాత్ర పోషించడం ద్వారా ప్రస్తుతం కొనసాగుతున్న బీజేపీ దుర్మార్గ రాజకీయాలను తిప్పికొట్టాలని, అందుకు దేశంలోని తమలాంటి అనేక మంది సీనియర్ రాజకీయ నాయకుల సంపూర్ణ మద్దతు ఉంటుందని వాఘేలా పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్తో శంకర్సింగ్ వాఘేలా సమావేశమయ్యారు. సుమారు ఐదు గంటలపాటు సాగిన సమావేశంలో వర్తమాన రాజకీయ పరిస్థితులు, పలు జాతీయ అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విపరీత పోకడలతో సాగిస్తున్న స్వార్థ రాజకీయ క్రీడ, దేశ ప్రజలపై దాని పర్యవసానాలపై ఇరువురు నేతలు సమాలోచన జరిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, జాతి అభివృద్ధే ధ్యేయంగా రాజకీయాల్లో కొనసాగుతున్న తమ వంటి సీనియర్ జాతీయనేతలంతా ప్రస్తుత బీజేపీ రాజకీయాలపై ఆందోళనతో ఉన్నారని వాఘేలా పేర్కొన్నారు.
సీనియర్లమంతా మీ వెంటే..
బీజేపీ పీడన నుంచి తెలంగాణతోపాటు సహచర రాష్ట్రాల ప్రజలను విముక్తం చేయాల్సిన బాధ్యత కేసీఆర్పై ఉన్నదని తమ వంటి సీనియర్నేతలు భావిస్తున్నారని వాఘేలా స్పష్టంచేశారు. ‘మీరు మీ అనుభవాన్ని కేవలం తెలంగాణకే పరిమితం చేయకుండా.. యావత్ దేశానికి విస్తరించాల్సిన సమయం వచ్చింది. నేను మీదగ్గరికి రావడానికి ముందే కాంగ్రెస్ సహా పలు పార్టీల్లోని సీనియర్ నాయకులమంతా కలిసి చర్చించుకున్నాం. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా ఉంటుందనుకున్న కాంగ్రెస్పార్టీ, నాయకత్వ లోపంతో కొట్టుమిట్టాడుతున్నది. బీజేపీ దుర్మార్గాలను ఎదురొనేందుకు కావలసిన రాజకీయ వ్యూహాన్ని, ఎత్తుగడలను అమలు చేస్తూ అందరినీ కలుపుకొనిపోవడంలో ఆ పార్టీ విఫలమౌతున్నది. ఈ నేపథ్యంలో దేశంలోని భావసారూప్య విపక్షాలను ఏకం చేసేందుకు మీ నాయకత్వం ఎంతో అవసరం. మీ సారథ్యంలో పనిచేయడానికి మేమంతా సంసిద్ధంగా ఉన్నాం’ అని వాఘేలా ముఖ్యమంత్రి కేసీఆర్తో చెప్పారు. ‘మేమంతా కలిసి నిర్ణయించుకున్న తర్వాతే నేను మీతో సమావేశం కావడానికి హైదరాబాద్ వచ్చాను. ఇంకా చెప్పాలంటే వారంతా కలిసే నన్ను మీవద్దకు పంపారు. మీకు మా అందరి మద్దతు ఔట్రైట్గా ఉంటుంది. మీరు జాతీయ రాజకీయాల్లోకి వచ్చి దేశగతిని మార్చాల్సిందిగా కోరుతున్నాం. అందుకు మిమ్మల్ని జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం’ అని వాఘేలా సీఎం కేసీఆర్ను కోరారు.
మోదీ, షా ఏం చేస్తారో నాకు తెలుసు..
‘నాదీ గుజరాతే. మోదీ, అమిత్షా గురించి బాగా తెలుసు. ఇలాగే దేశాన్ని వదిలేస్తే ఈ దేశం ఉండదు. దీన్ని బాగుచేయాలంటే ఎవరో ఒకరు ముందుకు రావాలె. తెలంగాణ రాష్ట్రం వేస్తున్న ప్రగతిశీల అడుగులను గమనిస్తున్నాను. ఈ రాష్ర్టాన్ని కష్టపడి సాధించారు. దీన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ దేశ సంక్షోభ పరిస్థితుల నుంచి బయటపడేసే సమర్థులు మీరే. తప్పకుండా మీరు జాతీయ రాజకీయాల్లోకి రావాలి. మేమంతా మీ వెంట ఉంటం’ అని శంకర్ సింగ్ వాఘేలా సీఎం కేసీఆర్కు స్పష్టమైన వాగ్దానం చేశారు.
తెలంగాణను ముందుకు నడిపిస్తూనే.. దేశ రాజకీయాల్లో మార్పునకు కృషి : కేసీఆర్
జాతీయ రాజకీయాల్లోకి రావాలన్న వాఘేలా ఆహ్వానానికి సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ‘తెలంగాణను ముఖ్యమంత్రిగా ముందుకు నడిపిస్తూనే.. దేశ రాజకీయాల్లో, పాలనలో గుణాత్మక మార్పును తేవడానికి తనవంతు కృషి చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. వాఘేలా వంటి సీనియర్ జాతీయ నాయకులు తనకు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తంచేశారు. తన నాయకత్వాన్ని సమర్థించడంపై వారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నానని సీఎం చెప్పారు.
కేసీఆర్లో పట్టువీడనితనాన్ని దేశం గుర్తించింది..
‘రావ్ సాబ్.. దేశంలోని ప్రజాస్వామిక ఫెడరల్ స్ఫూర్తిని మంటగలుపుతూ ప్రస్తుతం కేంద్రంలో ఒక నియంతృత్వ ధోరణి ప్రబలుతున్నది. దీన్ని ఇట్లనే చూస్తూ ఊరుకోలేక, నిలువరించే దిశగా సరియైన వేదిక దొరకక, ముందుండి నడిపించే నాయకత్వం లేక మాలాంటి సీనియర్లంతా కొంత ఆందోళనతో ఉన్నాం. ఈ సందర్భంలో మీరు కేంద్ర విధానాలను ప్రతిఘటిస్తున్న తీరు మావంటి సీనియర్ నాయకులను ప్రభావితం చేస్తున్నది. అనుకున్నదాన్ని సాధించేదాక పట్టిన పట్టు విడువని నాయకుడుగా మిమ్మల్ని ఇప్పటికే దేశం గుర్తించింది’ అని శంకర్ సింఘ్ వాఘేలా పేర్కొన్నారు.
బీజేపీ పాలనకు చరమగీతం పాడాల్సిందే
‘అసాధ్యమనుకున్న తెలంగాణను ఎన్నో కష్ట నష్టాలకోర్చి శాంతియుతంగా పార్లమెంటరీ రాజకీయ పంథా ద్వారా సాధించడం దేశ చరిత్రలో గొప్పవిషయం. సాధించిన రాష్ట్రాన్ని ముందుండి నడిపిస్తూ.. అనతికాలంలోనే రాష్ర్టాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. విభజనానంతరం తెలంగాణకు అండగా నిలవాల్సిన కేంద్రమే అడుగడుగునా ఇబ్బందులకు గురిచేస్తున్నా.. మొకవోని పట్టుదలతో ముందుకు పోతున్న మీ తెగువ నిజంగా మహోన్నతమైనది. మిమ్మల్నే కాకుండా దేశంలోని ప్రతి విపక్ష పాలిత రాష్ట్రాన్నీ భయభ్రాంతులకు గురిచేస్తూ నియంతృత్వ ధోరణుల ద్వారా లొంగదీసుకోవాలనే కుట్రలను బీజేపీ అమలు చేస్తున్నది. దేశంలో మత సామరస్యానికి, ప్రాంతీయ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నది. లౌకికవాదానికి, సమాఖ్యవాదానికి వ్యతిరేకంగా కేంద్రంలో బీజేపీ సాగిస్తున్న ఈ పాలనకు వచ్చే ఎన్నికల్లో చరమగీతం పాడాల్సి ఉన్నది’ అని శంకర్సింగ్ వాఘేలా చెప్పారు.
ఎవరీ శంకర్ సింగ్ వాఘేలా..?
గుజరాత్లో బలమైన పటేల్ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు శంకర్ సింగ్ వాఘేలా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఐదుసార్లు లోక్సభ సభ్యుడిగా.. ఒక పర్యాయం రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. కేంద్రమంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. గుజరాత్లో బీజేపీ విస్తరణకు విశేష కృషిచేశారు. ఆర్ఎస్ఎస్లో క్రియాశీల సభ్యుడిగా, జనసంఘ్తో విడదీయలేని బంధాన్ని వాఘేలా పెనవేసుకున్నారు. జనతాపార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆ పార్టీలో క్రియాశీల నాయకుడిగా ఎదిగారు. ఆ తరువాత బీజేపీలో చేరి సుదీర్ఘకాలం పనిచేశారు. గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర సహా పలు ఉత్తరాది రాష్ర్టాల్లో బీజేపీ విస్తరణకు కృషి చేశారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలతో విసుగుచెంది ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా ‘రాష్ట్రీయ జనతా పార్టీ’ని స్థాపించారు. ఆ తరువాత ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. లోలోన కాంగ్రెస్ పతనమవుతున్న తీరును చూసి.. ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు. పుట్టుపూర్వం మేనమామలకు తెలుసు అన్నట్టుగా.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షాల వ్యవహారం అంతా శంకర్సింగ్ వాఘేలాకు తెలుసునని ఉత్తరభారతం చెప్పుకుంటున్నది. మోదీ, అమిత్షాల రాజకీయజీవితం, వారి బాగోతం అంతా తెలిసిన వాఘేలా సీఎం కేసీఆర్తో భేటీ కావడంపై దేశ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతున్నది.