ఒకనాడు తెలంగాణలో కరెండు బుగ్గ ఎలిగితే వార్త.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కష్టాలు ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఎప్పుడో ఎండాకాలంలో వర్షంలాగా అర్ధరాత్రో అపరాత్రో వచ్చే కరెంటుతో రైతన్నల పోరాటాలు అన్నీ ఇన్నీ కావు.. రాత్రిపూట ఇచ్చే గంటా.. రెండు గంటల కరెంటుకోసం పడిగాపులు పడుతూ పాముకాట్లతో చనిపోయిన రైతులకు లెక్కే లేదు. మరి నేడు..! తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేండ్లలోనే కరెంటు పోతే వార్త అవుతున్నది. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలూ ఉచితంగా కరెంటు ఇస్తున్నది. ఇతర రంగాలకూ 24 గంటలూ పుష్కలంగా నాణ్యమైన విద్యుత్తు అందుతున్నది.. ఇదీ తెలంగాణలో కేసీఆర్ మాడల్..
62 ఏండ్ల వయసున్న రాష్ట్రం.. 22 ఏండ్లుగా ఏకఛత్రాధి పత్యంగా ఒకే పార్టీ పాలన.. ఎనిమిదేండ్లుగా డబుల్ ఇంజిన్ పాలన.. ఎక్కడ చూసినా ఒకటే ఊదరగొట్టుడు ప్రచారం.. కానీ.. ఇప్పటికీ కరెంటుకోసం రైతన్నలు రాస్తారోకోలు చేస్తున్నారు. ఉచితం మాట దేవుడెరుగు.. అడిగినంత డబ్బులిస్తాం.. కరెంటు ఇవ్వండి మహాప్రభో అని మొత్తు కొంటున్నారు. ఘనత వహించిన ఆ డబుల్ ఇంజిన్ రాష్ట్రంలో కరెంటు ఎప్పుడు వస్తదో, ఎప్పుడు పోతదో తెలువదు. పూటకో ప్రాంతంలో గంటకోసారి కోతలు.. సర్కారు ఇస్తామన్నది 8 గంటల కరెంటు.. కానీ ఇస్తున్నది రెండుమూడు గంటలే.. పగటిపూట కరెంటు ఇవ్వటానికి కూడా ఓ పథకం పెట్టినా.. రైతన్నలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి.. ఇదీ గుజరాత్ మాడల్.
(స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ)
గుజరాత్లో ప్రగతి రథానికి రెండు ఇంజిన్లు ఉంటాయి. ఒకటి మోదీ.. మరొకటి అమిత్షా.. ఒక ఇంజిన్ ముందు.. మరొకటి వెనక ఉంటాయి. రథాన్ని ఒక ఇంజిన్ ముందుకు లాగుతుంటే.. మరో ఇంజిన్ వెనక్కి లాగుతుంటుంది. వెరసి ఎక్కడ ఉన్న రథం అక్కడే ఉండిపోతుంది. గుజరాత్ మాడల్ అసలు స్వరూపం అచ్చంగా ఇదే. తెలంగాణ రాకముందు మన రాష్ట్ర రైతాంగం కరెంట్ కోసం ఎన్ని కడగండ్లు ఎదుర్కోవలసి వచ్చిందో.. పాతికేండ్లకు పైగా బీజేపీ ఏలుబడిలో ఉన్న గుజరాత్ రైతులు ఇప్పుడు అవే పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయానికి రాత్రిపూట 8 గంటలపాటు విద్యుత్తు సరఫరా చేస్తామని హామీలు గుప్పించిన గుజరాత్ ప్రభుత్వం నాలుగైదు గంటలు కూడా సరఫరా చేయడం లేదని అక్కడి రైతన్నలు లబోదిబోమంటున్నారు. అక్కడ రైతులకు విద్యుత్తు ఉచితంగా ఏమీ ఇవ్వరు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టి.. యూనిట్కు 60 పైసల చొప్పున ముక్కుపిండి మరీ వసూలుచేస్తారు. తత్కాల్ కనెక్షన్ అయితే మరో 20 పైసలు ఎక్కువ.. అంటే 80 పైసలు చెల్లించాల్సిందే. చార్జీలు వసూలు చేస్తే చేసిన్రు కానీ.. ఇస్త్తమన్న కరెంటైనా సక్కగ ఇస్తరా అంటే అదీ లేదు. 24 జిల్లాలు కలిగి ఉన్న గుజరాత్లో పశ్చిమ, ఉత్తర, దక్షిణ, మధ్య గుజరాత్ విజో కంపెనీ పేరుతో నాలుగు డిస్కంలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 17 లక్షల 25 వేల వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి. వ్యవసాయానికి విద్యుత్తును అందించే ఫీడర్లను 153 గ్రూపులుగా విభజించి ఒక్కో ఫీడర్లో ఒక్కో సమయానికి కరెంటు సరఫరా చేస్తున్నారు. నిజమేమిటంటే.. ఎక్కడ కూడా నిరంతరంగా 8 గంటలు విద్యుత్తు సరఫరా జరుగదు. ఒకటి రెండు గంటలు వస్తే మహా ఎక్కువ. 24 గంటలు చూస్తే.. నాలుగైదు గంటలు మించి సరఫరా ఉండదు. ఒకప్పుడు కరెంటు ఎప్పుడు వస్తదో.. ఎప్పుడు పోతదో తెలియక.. పొలాల్లోనే ఉండి.. కరెంటు షాకులకు, పాము కాట్లకు రైతులు బలైనట్టే.. ఇప్పుడు గుజరాత్లో రైతుల పరిస్థితి దారుణంగా మారింది.
కిసాన్ సూర్యోదయ యోజన
ఈ అర్ధరాత్రి కరెంటు నుంచి విముక్తి కల్పిం చి.. పగటిపూట సరఫరా చేయాలని మోదీజీ సీఎంగా ఉన్నప్పటి నుంచీ రైతులు రోడ్లమీద పడి ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. తాను ప్రధాని అయిన తరువాత రైతులపై కనికరం కలిగినట్టు నటించారు. పగటిపూట కరెంటు సరఫరా చేయడాన్ని కూడా ఓ స్కీంగా పేరు పెట్టుకొన్నారు.. ‘కిసాన్ సూర్యోదయ యోజన’ అని. 2020 గాంధీ జయంతి రోజున ఒక డిస్కం పరిధిలో ఆర్భాటంగా ప్రారంభించారు. గమ్మత్తేమిటంటే.. మోదీ ప్రారంభించిన మూడు నెలలకే సీఎం విజయ్ రూపానీ 2021 జనవరి 7న ఇదే స్కీంను మళ్లీ ప్రారంభించారు. 2022 నాటికి 18,000 గ్రామాలకు పగటిపూట సాగుకు విద్యుత్తు సరఫరాచేస్తామని ప్రకటించారు. ఇందుకు రూ.3,500 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. రెండుసార్లు స్విచ్లు ఆన్చేసిన ఈ పథకం.. ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. రైతులకు ఉపశమనం మాటే లేదు. ఆందోళనలు ఆగనే లేదు.
కనీసం 6 గంటలైనా ఇవ్వండి..
కరెంటు కోతలను నిరసిస్తూ గత మార్చి, ఏప్రిల్ నుంచి వేల మంది గుజరాత్ రైతులు రోడ్డెక్కారు. బీజేపీ సర్కారు అసమర్థ వైఖరికి వ్యతిరేకంగా మండలాలు, జిల్లాలు, తాలూకాల స్థాయిలో ఆందోళనలు రేగాయి. పగటిపూట నాణ్యమైన కరెంటును సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పఠాన్, బనస్కాంతా, మెహ్సానా, వడోదరా సహా సౌరాష్ట్రలోని 75 చోట్ల అన్నదాతలు చేపట్టిన ఈ నిరసనలు జాతీయ స్థాయిలో తీవ్రచర్చకు దారితీశాయి. సాగుకు 12 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా, ఏకరూప టారిఫ్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ సంఘ్ కూడా సెప్టెంబర్ మొదటివారంలో రాజధాని గాంధీనగర్లో బంద్ నిర్వహించింది. విద్యుత్తు సరఫరా అంశంలో కాం గ్రెస్ ఎమ్మెల్యేలు లలిత్ వసోయా, విమల్ చూడాసమా అసెంబ్లీ బయట అంగీ విప్పి నిరసన వ్యక్తంచేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం.. విద్యుత్తు సరఫరా నానాటికీ దిగజారుతుండటంతో రైతుల ఆందోళనలు తారస్థాయికి చేరుకొన్నాయి. తప్పని పరిస్థితుల్లో గుజరాత్ విద్యుత్తు, వ్యవసాయ మంత్రులు రైతు ప్రతినిధులతో చర్చలు చేశారే కానీ.. విద్యుత్తు సమస్యను పరిష్కరించడం వాళ్ల వల్ల కాలేదు. కనీసం ఆరు గంటలైనా కరెంటు సరఫరాకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారే తప్ప నిలబెట్టుకోలేకపోయారు. అసెంబ్లీలో విపక్ష నేతలు అర్ధనగ్న ప్రదర్శన చేయడంతో గుజరాత్ ప్రభుత్వం చెప్పిన సమాధానం ఏమిటంటే.. ‘విద్యుత్తు సమస్యకు పాతికేండ్ల కిం దట రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్సే కారణం’ అని.. ఒక సమస్యను పాతికేండ్లయినా పరిష్కరించలేని ఈ సర్కారు ఉంటే ఏమిటి? ఊడితే ఏమిటని రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇంత నిస్సిగ్గుగా ఎలా జవాబు చెప్తారని మండిపడుతున్నారు.
కర్షకుల కడగండ్లు
ఎనిమిది నెలలు దాటిపోయింది రైతులు తమ పంటలను కాపాడుకోవడం కోసం రోడ్లెక్కి. రైతులకు సక్రమంగా కావలసినంత కరెంటు ఇవ్వాలని విపక్ష పార్టీలు అసెంబ్లీ లోపలా.. బయటా ఆందోళనలు చేస్తున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అంగీలు విప్పి అర్ధ నగ్నంగా కూడా నిరసనలు తెలిపారు. కానీ మోదీ రాష్ట్రంలో మోదీ పార్టీ ప్రభుత్వానికి రైతులపట్ల దయలేకుండా పోయింది. మోదీ సొంత రాష్ట్రంలోనే వ్యవసాయానికి ఉచితమన్న మాటే లేదు. బయట రాష్ర్టాల్లో మాత్రం మోటర్లకు మీటర్ల మాట మేం చెప్పనే చెప్పడం లేదంటారు. ప్రధాని రాష్ట్రంలోనే రైతుల పరిస్థితి ఇట్లా ఉంటే.. కేంద్రంలోని మోదీ సర్కారు.. దేశ రైతాంగానికి మాత్రం ఏం ఒరగబెడుతుందన్న ప్రశ్నకు ఎవరు మాత్రం ఏం జవాబు చెప్పగలరు?
రాష్ట్ర అవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు సాగునీరు, విద్యుత్తు సరఫరాపైనే ప్రత్యేక దృష్టి సారించారు. విద్యుత్తు రంగానికి అమిత ప్రాధాన్యం ఇచ్చి ఆరునెలల్లోనే కోతల్లేని కరెంటు సరఫరాచేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తును జనవరి1, 2018 నుంచి ప్రారంభించి ఇప్పటికీ నిరాటంకంగా సరఫరా చేస్తున్నారు. తెలంగాణలో మాదిరిగానే వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు దేశమంతా ఇవ్వవచ్చని ధీమాగా ప్రకటించారు. దక్షత గలిగి.. ఏ పనైనా చేయాలన్న నిబద్ధత గలిగిన నేత ఉంటే ఏదైనా సాధ్యమేననడానికి సీఎం కేసీఆర్ ఉదాహరణ అని విశ్లేషకులు అంటున్నారు. 24 గంటలు రెప్పపాటు అంతరాయం లేకుండా వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇస్తున్న తెలంగాణ మాడల్కు, డబ్బులు పెట్టి కొన్నా నాలుగైదు గంటలకు మించి కరెంట్ ఇవ్వలేని గుజరాత్ మాడల్కు నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా కనిపిస్తున్నదని అభిప్రాయపడుతున్నారు.
రోజూ 100 ఫోన్లు
విద్యుత్తు కోతలతో నా నియోజకవర్గంలో కొబ్బరి రైతులు నానా కష్టాలు పడుతున్నారు. వారికి ఏడెనిమిది గంటల సరఫరా అవసరమౌతుంది. కానీ, మూడు గంటలు కూడా రావడంలేదు. కోతల విషయమై ప్రతి రోజు నాకు 100 ఫోన్లు వస్తున్నాయి. ఈ విషయంలో సాయం చేయాలని రైతులు ప్రాధేయపడుతున్నారు. ఇది పెద్ద సంక్షోభం. అవసరం ఉన్నప్పుడు కరెంటు సైప్లె చేయకుండా, రాత్రిళ్లు సరఫరా చేస్తున్నారు. రైతులు కంటినిండా నిద్ర కూడా పోవట్లేదు.
– విమల్ చూడాసమా, కాంగ్రెస్ ఎమ్మెల్యే, సోమ్నాథ్
మూడు గంటలైనా ఇస్తలేరు..
ఆరు గంటలపాటు నిరంతరాయంగా కరెంటు ఇస్తామని బీజేపీ సర్కారు హామీ ఇచ్చింది. మూడు గంటలు కూడా సైప్లె జరుగటంలేదు.
– లలిత్ వసోయా, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ధరోజి