హైదరాబాద్ : తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి హైదరాబాద్లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమావేశంలో లాక్ డౌన్ తరువాత ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, ములుగు, తొర్రూర్, మరిపెడ లాంటి ప్రదేశాలలలో గుడుంబా అమ్మకాలు సాగిస్తున్నారన్నారనే సమాచారంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట, కొల్లపూర్లలో అక్కడక్కడా గుడుంబా అమ్మకాలు జరుగుతున్నాయి. వాటిని వెంటనే నిర్ములించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులు ఆదేశించారు. రాష్ట్రంలో గంజాయి అమ్మకాలు, రవాణాపై ఉక్కుపాదం మోపాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.
గంజాయిని అమ్మకాలు, రవాణా చేస్తున్న వారిపై పీడీ యాక్ట్ , బైండోవర్ కేసులను నమోదు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పోలీస్, ఆబ్కారీ శాఖల అధికారులు సమన్వయం చేసుకొని గంజాయి స్మగ్లింగ్ ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
నీరా పాలసీ పనులను వేగవంతం చేసి వచ్చే రెండు నెలల్లో అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. నీరా అనుబంధ ఉత్పత్తులకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని నందనంలో పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నీరా ఉత్పత్తి ప్రభుత్వం ఇప్పటికే జీవోను విడుదల చేసిందన్నారు.
బీసీ కార్పొరేషన్, ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులు వెంటనే సమన్వయ సమావేశం నిర్వహించుకొని టెండర్లు పిలవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..ఉమ్మడి వరంగల్ జిల్లాలో గుడుంబా నిర్ములనకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
సమావేశంలో రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు కమిషనర్ అజయ్ రావు, జాయింట్ కమిషనర్ ఖురేషీ, డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు, హరికిషన్, డేవిడ్ రవికాంత్, సహాయ కమిషనర్ దత్తరాజు గౌడ్, చంద్రయ్య గౌడ్, రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.