జగిత్యాల : మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని రద్దు చేయాలని జగిత్యాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత సురేశ్ ప్రధానిమోదీకి పోస్ట్ కార్డు రాశారు. ఇప్పటికే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు పలువురు ప్రధానికి పలువురు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ జిల్లాలోని చేనేత కార్మికుల పక్షాన చేనేత కార్మికుల సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకొచ్చేందుకు పోస్టుకార్డు ఉద్యమంలో తనవంతు బాధ్యతగా కార్డును పంపినట్లు పేర్కొన్నారు.
చేనేత వస్త్రాలు, చేనేత ఉత్పత్తులపై ఉన్న ఐదు శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి, దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చేనేత ఉత్పత్తులపై పన్ను వేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో యావత్ భారత జాతిని ఏకతాటిపై నడిపించిన చేనేత వస్త్రాలపై పన్ను వేసిన తొలి ప్రధాని మోదీనేనని విమర్శించారు. దేశంలో రెండో అతిపెద్ద రంగమైన చేనేతపై పన్నును రద్దు చేయాలని పోస్ట్ కార్డులో పేర్కొన్నారు. చేనేత కార్మికులందరూ కూడా పోస్టుకార్డు ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.