కరీంనగర్ విద్యానగర్, మార్చి 9 : ఔషధాలపై జీఎస్టీ ఎత్తి వేయాలని సీనియర్ వైద్యుడు ఎడవెల్లి విజయేందర్రెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్లోని పద్మశాలీ కల్యాణ మండపంలో తెలంగాణ మెడికల్, సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఐదో రాష్ట్ర మహాసభల మొదటి రోజు సమావేశాలను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. నాసిరకం మందులను అరికట్టాలని, ఆన్లైన్లో మందుల అమ్మకాలను నిషేధించాలని సూచించారు.
ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పూర్వ ప్రధాన కార్యదర్శి కే వేణుగోపాల్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఖండించారు. ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కే రమేశ్ సుందర్ మాట్లాడుతూ.. సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్-1976ను పరిరక్షించాలని, మెడికల్ రిప్రజెంటేటివ్స్కు చట్టబద్ధమైన పని విధానాలను కల్పించాలని కోరారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జీ వెంకట్రెడ్డి, టీఎంఎస్ఆర్యూ జనరల్ సెక్రటరీ రాజు భట్ తదితరులు పాల్గొన్నారు.