హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): హ్యాండ్ శానిటైజర్లకు ఔషధ గుర్తింపు ఇవ్వలేదని కేంద్రప్రభుత్వం స్పష్టంచేసింది. సోమవారం పార్లమెంట్లో ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ సమాధానమిచ్చారు. అంతర్జాతీయంగా హ్యాండ్ శానిటైజర్లను క్రిమిసంహారకంగా మాత్రమే వర్గీకరించినట్టు చెప్పారు. హ్యాండ్ శానిటైజర్లకు ఔషధ గుర్తింపుతోపాటు జీఎస్టీ తగ్గించాలని తమకు దేశీయ ఉత్పత్తి సంస్థల నుంచి విజ్ఞప్తులు వచ్చినట్టు ఆమె తెలిపారు. ఈ విషయంపై జీఎస్టీ కౌన్సిల్లోని 44వ సమావేశం సిఫారసు మేరకు హ్యాండ్ శానిటైజర్లపై జీఎస్టీని 18నుంచి 5 శాతానికి తగ్గించామని గుర్తుచేశారు. తగ్గించిన శ్లాబులు జూన్14 నుంచి సెప్టెంబర్ 30 దాకా అమలులో ఉంటాయని పేర్కొన్నారు.