హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన గృహలక్ష్మి సొంతింటి పథకాన్ని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్ (బీఎల్సీ) మోడ్లో ఇచ్చే రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని నిలిపివేసింది. మొత్తం నాలుగు లక్షల ఇండ్లకు గాను మొదటి విడతలో 2,12,095 మందికి ఇండ్లు మంజూరు చేశారు. అయితే, కొత్త ప్రభుత్వం అభయహస్తం కార్యక్రమంలో ఇల్ల్లు లేని పేదలు సొంతంగా ఇల్లు నిర్మించుకునేందుకు ‘ఇందిరమ్మ ఇండ్ల’ పథకంలో భాగంగా రూ.5 లక్షల ఆర్థికసాయం చేస్తుండటంతో ‘గృహలక్ష్మి’ పథకాన్ని నిలిపివేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
ఆరు గ్యారెంటీల్లో వచ్చిన దరఖాస్తులను క్రోడీకరించి అర్హులను ఎంపిక చేసి, నిరుపేదలు తమ సొంత స్థలంలో ఇండ్లు నిర్మించుకుంటే రూ.5 లక్షల ఆర్థికసాయం చేస్తామని వెల్లడించింది. ఈ క్రమంలో గృహలక్ష్మి పథకాన్ని నిలిపివేసేందుకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని, ఈ పథకం కింద ఆయా జిల్లాల కలెక్టర్లు గతంలో జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని నూతన ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఆదేశించింది.