Gruhalakshmi scheme | హైదరాబాద్, ఆగస్టు 9(నమస్తే తెలంగాణ): గృహలక్ష్మి పథకం అమలు నిరంతర ప్రక్రియ అని, దరఖాస్తుల గడువు తీరిపోతున్నదనే ఆందోళన అవసరం లేదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఒక ప్రకటనలో కోరారు. దశలవారీగా అర్హులైన పేదల కోసం ఈ పథకాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. మొదటి దశ ఇండ్ల నిర్మాణం పూర్తయ్యాక రెండో దశలో మళ్లీ ఇండ్లను మంజూరు చేస్తామని, మొదటి దశలో మిగిలిన దరఖాస్తులను రెండోదశలో పరిశీలిస్తామని తెలిపారు. తొలి దశలో ప్రతి నియోజకవర్గానికి 3,000 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల ఇండ్లను మంజూరు చేస్తామని, ఒక్కో ఇంటికి రూ.3 లక్షల చొప్పున ఇవ్వనున్నట్టు తెలిపారు. దరఖాస్తు చేసుకొనేందుకు ఎటువంటి అడ్డంకులూ లేవని పేర్కొన్నారు. గ్రామ కంఠంలో ఉన్న పాత ఇండ్లు, దస్తావేజులు లేని స్థలాలు ఉన్నా ఇంటి నంబర్పై దరఖాస్తు చేసుకోవచ్చని, ఖాళీ జాగ ఉన్నా అర్హత ఉంటుందని తెలిపారు. అర్హులైన వారు తమ దరఖాస్తులను ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లా కలెక్టర్కు పంపాలని సూచించారు.