సిద్దిపేట అర్బన్, నవంబర్ 13: రాష్ట్రంలో త్వరలోనే గ్రూప్-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాబోతున్నదని ఆర్థిక మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేటలోని మల్టీపర్పస్ హైస్కూల్లో పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల కోసం శారీరక దారుఢ్య పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం 300 మంది అభ్యర్థులకు ఆయన సొంత ఖర్చుతో పాలు, గుడ్లు, పండ్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. త్వరలో వెలువడే గ్రూప్-4 నోటిఫికేషన్లో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఉంటాయని పేర్కొన్నారు. గతంలో రాష్ట్ర పోలీసు ఉద్యోగాల్లో అవకాశం దక్కని వారికి కేంద్రం ఆధ్వర్యంలోని ఆర్మీ ఉద్యోగాలకు అవకాశం ఉండేదని చెప్పారు. కానీ యువత ఆశలను నిర్వీర్యం చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అగ్నిపథ్ పేరిట కాంట్రాక్టు విధానం తేవడం హేయమైన చర్య అని విమర్శించారు.
అగ్నిపథ్ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా యువత ఉద్యమం చేసిన విషయం తెలిసిందేనని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసిందని, ఆ ప్రక్రియ కొనసాగుతున్నదని, అందులో 17 వేల ఉద్యోగాలు పోలీసు శాఖకు చెందినవేనని చెప్పారు. అభివృద్ధి అంటే రోడ్లు, భవనాలు నిర్మించడమే కాదని, సామాజికంగా, ఉపాధి పరంగా, ఆరోగ్య పరంగా, ఆర్థికంగా, పచ్చదనంలో.. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడమే నిజమైన అభివృద్ధి అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్రెడ్డి, అడిషనల్ డీసీపీ (అడ్మిన్) మహేందర్, ఏసీపీ దేవారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్కు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. సిద్దిపేట నియోజకవర్గంలో అన్ని వర్గాల నుంచి స్వచ్ఛందంగా విరాళాలు అందుతున్నాయి. ఆదివారం సిద్దిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయా గ్రామాలకు చెందిన కుల సంఘాలు హరీశ్రావుకు విరాళాలు అందించాయి. సిద్దిపేటలోని ముదిరాజ్ సంఘాలు రూ.41 వేలు, సిద్దిపేట రూరల్ మండలం పెద్దలింగారెడ్డిపల్లికి చెందిన వివిధ కుల సంఘాలు రూ.40 వేలు, లింగారెడ్డిపల్లిలోని పలు సంఘాలు రూ.65 వేలు అందజేశారు. లింగారెడ్డిపల్లికి చెందిన ఖైతా తరుణ్ తన కిడ్డీ బ్యాంకులో దాచుకున్న రూ.2 వేలను బీఆర్ఎస్కు విరాళంగా అందజేశాడు. మంత్రి హరీశ్రావుకు తన గల్లా పెట్టెను తరుణ్ ఇచ్చాడు.