హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-4 దరఖాస్తు గడువును ఫిబ్రవరి 3 వరకు పొడిగిస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. కొత్తగా 2,391 ఉద్యోగాలకు అనుమతి ఇస్తూ శుక్రవారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అందులో 141 ఉద్యోగాలను గ్రూప్-4లో కలుపుతూ టీఎస్పీఎస్సీ శనివారం ప్రకటించింది. వీటిలో బీసీ బాలుర గురుకులాల్లో 86, బాలికల గురుకులాల్లో 55 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. గ్రూప్-4లో అదనపు పోస్టులను జోడించడంతో దరఖాస్తుకు సమయం ఇచ్చినట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు.
ఈ 141 ఉద్యోగాల భర్తీలో ఇప్పటివరకు దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులను కూడా పరిగణనలోకి తీసుకొంటామని వెల్లడించారు. వివరాలకు https:// www.tspsc.gov.inను సంప్రదించాలని కోరారు. రాష్ట్రంలో 25 విభాగాల్లో 8,039 గ్రూప్-4 ఉద్యోగాలకు గత డిసెంబర్ 1న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు 8,47,277 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నారు.