హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలపై టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తున్నది. ఆగస్టు మొదటి వారంలో ఫలితాలు ఇచ్చేందుకు సమాయత్తం అవుతున్నది. ఇప్పటికే ప్రిలిమ్స్ ప్రాథమిక ‘కీ’ని విడుదల చేసింది. అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను వెబ్సైట్లో పొందుపరిచింది. వచ్చిన అభ్యంతరాలపై నిపుణుల కమిటీతో చర్చించింది. అన్నీ ఒకటికి రెండుసార్లు మళ్లీ పరిశీలించింది. వచ్చే సోమ లేదా మంగళవారాల్లో ఫైనల్ కీ ఇచ్చే అవకాశం ఉన్నదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గ్రూప్-1లో 503 ఉద్యోగాలుండగా, పోస్టుకు 50 మంది చొప్పున మొత్తం 25,150 మంది అభ్యర్థులను మెయిన్స్కు ఎంపిక చేస్తారు. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో గ్రూప్-1 మెయిన్స్ నిర్వహించే అవకాశం ఉన్నది.