హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): ఉద్యోగార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడికి మార్గం సుగమమైంది. ఓ అభ్యర్థి స్థానికత వివాదం నేపథ్యంలో నిలిచిపోయిన ఈ ఫలితాలను విడుదల చేసేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. సదరు అభ్యర్థి అభ్యర్థన కారణంగా ఈ ఫలితాలను నిలిపివేయడం సరికాదని, ఆ అభ్యర్థి స్థానికత అంశంపై తర్వాత విచారణ జరుపుతామని బుధవారం స్పష్టం చేసింది. దీంతో సంక్రాంతిలోపే ఫలితాలను వెల్లడిస్తామని టీఎస్పీఎస్సీ వర్గాలు తెలిపాయి.
ఏడో తరగతి నుంచి పీజీ వరకు తెలంగాణలో చదవిన తనకు స్థానికత కోటాను వర్తింపజేయకపోవడాన్ని సవాలు చేస్తూ పీ నిహారిక అనే యువతి హైకోర్టును ఆశ్రయించడంతో స్థానికతను పరిగణనలో తీసుకోవాలని సింగిల్ జడ్జి గతంలో టీఎస్పీఎస్సీని ఆదేశించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ టీఎస్పీఎస్సీ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్పై జస్టిస్ అభినంద్కుమార్ షావిలి, జస్టిస్ పీ కార్తీక్తో కూడిన ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది. టీఎస్పీఎస్సీ తరఫున ఎం రాంగోపాల్రావు వాదిస్తూ.. ఏడో తరగతి వరకు తెలంగాణలో చదివినవారికే స్థానికత వర్తిస్తుందని, నిహారిక ఏపీలోని విశాఖలో ఆరో తరగతి చదివినందున ఆమెకు స్థానికత వర్తించదని తెలిపారు.
లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల విడుదలకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీనిపై నిహారిక తరఫు న్యాయవాది స్పందిస్తూ.. సింగిల్ జడ్జి తీర్పును అమలు చేయాలని ప్రతివాదన చేశారు. ఇరు పక్షాల వాదనల అనంతరం ఫలితాల వెల్లడికి అనుమతించిన ధర్మాసనం.. నిహారికకు సంబంధించిన వివరాలను నివేదించాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది. ఆమె స్థానికత వివాదంపై తర్వాత విచారణ జరిపి తుది ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది.