హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమినరీ (Group-1 Prelims) పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తున్న ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ఉదయం 10.30 నిమిషాలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియనుంది. ఈ పరీక్షకు 3,80,081 మంది దరఖాస్తు చేసుకున్నారు. 33 జిల్లా కేంద్రాల్లో 994 సెంటర్లలో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష ప్రారంభానికి పావు గంట ముందే ఎగ్జామ్ సెంటర్ల గేట్లు మూసివేశారు. ఉదయం 10.15 గంటల తర్వాత అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించలేదు. పలువురు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు వారిని తిరిగి పంపించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుచేస్తున్నారు.
పరీక్షా కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడితే డిబార్ చేస్తామని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీఎస్పీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. కాగా, రామంతాపూర్లో గ్రూప్-1 పరీక్ష కేంద్రాన్ని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్, కూకట్పల్లిలో పరీక్ష కేంద్రాలను ఏసీపీ చంద్రశేఖర్ పరిశీలించారు.