హైదరాబాద్ శివారు పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని సిటిజెన్ కాలనీ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవన వాచ్మెన్ దంపతులను కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గురుడు మండలం దొంగచింత తండాకు చెందిన దంపతులు సోమ్లా దశరథ్ (50), మాన్యమ్మ (45) కొంతకాలం కింద జీవనోపాధి కోసం హైదరాబాద్కు వచ్చారు. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని సిటిజెన్ కాలనీ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనానికి వాచ్మెన్గా పనిలో చేరారు. అక్కడే నిర్మాణంలో ఉన్న భవనం దగ్గరే ఉంటున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం పనికి వచ్చిన భవన నిర్మాణ సిబ్బంది.. వాచ్మెన్ దంపతులను దారుణంగా హత్య చేసినట్లుగా గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఘటనాస్థలిని క్షుణ్నంగా పరిశీలించారు. క్లూస్ టీమ్ సహాయంతో దర్యాప్తు చేపట్టారు.