Vishal | తమిళ సినీ దిగ్గజం ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) గురించి చేసిన వ్యాఖ్యల కారణంగా సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఓ కార్యక్రమంలో తెలుగు దిగ్గజ నటుడు కాంతారావు గొప్పతనాన్ని ప్రస్తావించే సందర్భంలో ఎంజీఆర్పై రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా ఆయన ఉపయోగించిన పదజాలం తమిళ అభిమానులను తీవ్రంగా బాధించడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ ఘటనపై తమిళ సినీ వర్గాలు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా తమిళ నటులు విశాల్, నాజర్ వంటి ప్రముఖులు స్పందిస్తూ ఎంజీఆర్ను తమిళనాడులో ప్రజలు దేవుడిలా భావిస్తారని, అలాంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. అలాగే తమిళనాడు ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తరఫున కూడా ఈ అంశంపై స్పందించాలని కోరినట్లు తెలిపారు.
వివాదం మరింత పెరుగుతున్న నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ వెంటనే స్పందించారు. ఈ విషయంపై ఒక వీడియో విడుదల చేసి ఎంజీఆర్ అభిమానులకు హృదయపూర్వక క్షమాపణలు చెప్పారు. తనకు ఎంజీఆర్పై అపారమైన గౌరవం ఉందని ఆయన స్పష్టం చేశారు. కాంతారావు అవార్డు కార్యక్రమంలో ఆయన గొప్పతనం గురించి మాట్లాడే సమయంలో అనుకోకుండా ఒక మాట తప్పుగా వచ్చిందని తెలిపారు. తన వ్యాఖ్యలు ఎవరి మనసును నొప్పించి ఉంటే క్షమించాలంటూ విజ్ఞప్తి చేశారు. అలాగే తాను మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్న సమయంలో ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో ఎంజీఆర్ తమ ఇన్స్టిట్యూట్కు వచ్చి విద్యార్థుల ప్రదర్శనలు చూసిన విషయాన్ని కూడా వివరించారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి కావాలనే తప్పుగా మాట్లాడే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని ఆయన చెప్పారు. ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగవని, ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని కోరారు.
రాజేంద్ర ప్రసాద్ విడుదల చేసిన ఈ క్షమాపణ వీడియోపై తాజాగా హీరో విశాల్ స్పందించారు. ఒక వీడియో ద్వారా ఆయన రాజేంద్ర ప్రసాద్కు ధన్యవాదాలు తెలిపారు. “ఎంజీఆర్ గురించి మీకే బాగా తెలుసు. మేమంతా కొత్తగా వచ్చినవాళ్లం. కానీ మీ వ్యాఖ్యల వల్ల చాలామంది సీనియర్ నటులు బాధపడ్డారు. అందుకే వెంటనే స్పందించాలని మేము కోరాం. మీరు మా అభ్యర్థనను గౌరవించి వెంటనే క్షమాపణ చెప్పినందుకు ధన్యవాదాలు,” అని విశాల్ అన్నారు. అదే సమయంలో మీలాంటి సీనియర్ ఆర్టిస్టుల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా తాము ఇలాగే స్పందిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం విశాల్ చేసిన ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు కూడా ఈ వివాదం ఇక్కడితో ముగియాలని కోరుకుంటున్నారు.