503 పోస్టులతో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్
తొలిసారి ఈడబ్ల్యూఎస్, స్పోర్ట్స్ రిజర్వేషన్
మే 2 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
అదే నెల 31 వరకు సమర్పణకు అవకాశం
ఉర్దూలోనూ ప్రిలిమ్స్, మెయిన్స్ ప్రశ్నాపత్రాలు
స్వరాష్ట్రంలో ఇదే తొలి గ్రూప్-1 నోటిఫికేషన్
దేశ చరిత్రలో అతి భారీ నోటిఫికేషన్ మనదే
95% కొలువులు స్థానికులకే.. ఇదే తొలిసారి
42 డిప్యూటీ కలెక్టర్ పోస్టులు
91 పోస్టులు – డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు
48 పోస్టులు – కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్
121 పోస్టులు – ఎంపీడీవో పోస్టులు
టీఎస్పీఎస్సీ ఏర్పడిన తరువాత వెలువడిన తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ ఇదే.
చిన్న రాష్ట్రంలో 503 పోస్టులతో భారీ నోటిఫికేషన్ వెలువడం ఇదే ప్రథమం.
ఉమ్మడి రాష్ట్రం (573) పోస్టులతో పోల్చితే తెలంగాణలో భారీగా భర్తీచేయడం విశేషం.
గ్రూప్-1కు దరఖాస్తు చేయాలంటే టీఎస్పీఎస్సీ ఓటీఆర్ తప్పనిసరి.
గ్రూప్-1 ఉద్యోగాలకు తొలిసారిగా ఈడబ్ల్యూఎస్, స్పోర్ట్స్ రిజర్వేషన్లను వర్తింపజేస్తున్నారు.
ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కోసం మల్టీజోన్ల వారీగా 1: 50 ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపికచేస్తారు.
గ్రూప్- షెడ్యూల్ ఇలా..
ఆన్లైన్ దరఖాస్తులు మే 2 నుంచి 31
ప్రిలిమ్స్ పరీక్ష జూలై/ఆగస్టు 2022
మెయిన్స్ నవంబర్/ డిసెంబర్ 2022లో
హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 అభ్యర్థులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నోటిఫికేషన్ రానేవచ్చింది. మొత్తం 503 గ్రూప్-1 పోస్టులకు టీఎస్పీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 18 శాఖలకు చెందిన పోస్టులను భర్తీ చేయనున్నట్టు కమిషన్ వర్గాలు వెల్లడించాయి. ఇందులో డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 42, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు-91, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్-48, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2 పోస్టులు-41, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్-38, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్-40, ఎంపీడీవో పోస్టులు-121తో పాటు మరికొన్ని పోస్టులు ఉన్నాయి.
టీఎస్పీఎస్సీ ఏర్పడిన తరువాత వెలువడిన తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ ఇదే. చిన్న రాష్ట్రంలో ఇన్ని పోస్టులతో భారీ నోటిఫికేషన్ వెలువడం కూడా ఇదే ప్రథమం. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అత్యధికంగా 573 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడినప్పటికీ, రాష్ట్ర విస్తీర్ణంతో పోల్చుకొంటే ఇదే పెద్ద నోటిఫికేషన్ అవుతుంది. రాష్ట్రపతి ఉత్తర్వులు 2018 ప్రకారం తొలిసారిగా గ్రూప్ -1 ఉద్యోగాల భర్తీలో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయి. టీఎస్పీఎస్సీ చైర్మన్ డాక్టర్ బీ జనార్దన్రెడ్డి అధ్యక్షతన కమిషన్ సభ్యులు మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం నోటిఫికేషన్ను జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జనార్దన్రెడ్డి, కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్, సభ్యులు సుమిత్రానంద్ తనోబా, అరుణకుమారి, రమావత్ ధన్సింగ్, ప్రొఫెసర్ బండి లింగారెడ్డి, ఆర్ సత్యనారాయణ, కారం రవీందర్రెడ్డి పాల్గొన్నారు.
భర్తీ విధానంలో ముఖ్యాంశాలు..
స్వరాష్ట్రంలో తొలి, భారీ గ్రూప్-1 నోటిఫికేషన్
సివిల్ సర్వీసెస్ పోస్టుల తర్వాత అత్యంత క్రేజీ ఉన్నది గ్రూప్-1కే. వీటిని స్టేట్ సివిల్ సర్వీసెస్ పోస్టులుగా భావిస్తారు. పరిపాలనలో కీలకంగా వ్యవహరించేది గ్రూప్-1 అధికారులే. మంగళవారం జారీచేసిన నోటిఫికేషన్ను తెలంగాణ ఏర్పడిన తరువాత విడుదలైన తొలి గ్రూప్-1 నోటిఫికేషన్గా చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నప్పుడు కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం 2011లో నోటిఫికేషన్ జారీచేసింది. విద్యార్థి, యువతను ఉద్యమం నుంచి పక్కదారి పట్టించేందుకు అప్పట్లో నోటిఫికేషన్ ఇవ్వడం, పరీక్షను ఉద్యమకారులు అడ్డుకోవడం, మరలా పరీక్షలు నిర్వహించడం వంటి పరిణామాలు జరిగాయి. దీంతో పోస్టుల భర్తీ ప్రక్రియ ఆలస్యమైంది. ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు మాత్రమే 570కి పైగా పోస్టులను భర్తీచేయగా, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో అదే స్థాయిలో పోస్టులను భర్తీచేయనుండటం విశేషం. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే ఏపీలో కేవలం 78 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ జారీచేశారు. అటు తరువాత 2019లో ఏపీలో 169 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినా దానిపై కోర్టులో వివాదం నడుస్తున్నది.