TSPSC | గ్రూప్-1 పరీక్షకు దరఖాస్తు చేయకపోయినా ఓ అభ్యర్థికి హాల్ టికెట్ జారీ చేశారంటూ ప్రచారం జరిగింది. ఈ వార్తలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖండించింది. నిజామాబాద్కు చెందిన జక్కుల సుచిత్ర టీఎస్పీఎస్సీ ఐడీ TS1201206420తో గ్రూప్-1 కోసం దరఖాస్తు చేశారని, అక్టోబర్ 16న ప్రిలిమ్స్ రాశారని సెంటర్ కోడ్, నామినల్ రోల్లో సుచిత్ర సంతకం అన్నీ ఉన్నాయని స్పష్టం చేసింది. అయితే, ఈ విషయమై అభ్యర్థి జక్కుల సుచిత్ర మంగళవారం స్పందించింది. టీఎస్పీఎస్సీకి బహిరంగ క్షమాపణలు చెప్పింది. తాను గ్రూప్-1 కోసం దరఖాస్తు చేశానని, గతేడాది అక్టోబర్లో నిర్వహించిన ప్రిలిమ్స్కు హాజరైనట్లు చెప్పింది.
అయితే, అప్పుడు పరీక్షకు వచ్చేముందు మా కుటుంబానికి చెందిన వాహనం ప్రమాదానికి గురైందని, ఆ రోజు పరీక్ష ముగిసిన తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరగడమే సరిపోయిందని చెప్పింది. అంతకంటే మూడురోజుల ముందే మా దగ్గరి బంధువులు నలుగురు చనిపోయారని, తాను ఇప్పటికీ ఆ డిప్రెషన్ నుంచి పూర్తిగా కోలుకోలేదని, దాంతో అప్పుడు పరీక్ష రాసిన విషయం సైతం తనకు గుర్తు లేదని చెప్పింది. ఈ నేపథ్యంలో శనివారం హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని టీఎస్పీఎస్సీ నుంచి మెసేజ్ వచ్చిందని, ఆ సమయంలోనే ఒక మీడియా సంస్థతో మాట్లాడానని, దాన్ని కొందరు బాగా వైరల్ చేశారని చెప్పింది. ఈ విషయంలో తప్పంతా తనదేనంటూ టీఎస్పీఎస్సీని సుచిత్ర క్షమాపణలు కోరింది.