హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): గత ఏడాది కంటే ఈసారి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఇప్పటికే గరిష్ఠ స్థాయికి చేరుకున్నా భూగర్భ జలాలు మాత్రం తగ్గిపోలేదు. అదీగాక గత సంవత్సరం మే నెలతో పోల్చితే ఈ ఏడాది మే నెలలో భూగర్భ జలమట్టం 0.18 మీటర్ల మేరకు పెరిగిందని రాష్ట్ర భూగర్భ జలశాఖ డైరెక్టర్ పండిత్ మడ్నూరె వెల్లడించారు. మే నెల నివేదికను బుధవారం ఆయన విడుదల చేశారు. గత మే నెలతో పోల్చితే ప్రస్తుతం 20 జిల్లాలో 0.03-2.39 మీటర్ల మేరకు భూగర్భ జలమట్టాలు పెరిగాయని వివరించారు.
మిగిలిన 13 జిల్లాల్లో 0.17-2.54 మీటర్ల మేరకు భూగర్భజలం తగ్గిపోయిందని తెలిపారు. అయితే గతేడాదితో పోల్చితే రాష్ట్రవ్యాప్తంగా సగటున 0.18 మీటర్ల మేర నీటిమట్టం పెరిగిందని డైరెక్టర్ మడ్నూరె తన నివేదికలో వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 9.01 మీటర్ల లోతులో భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయని, వనపర్తిలో అత్యల్పంగా 5.17 మీటర్ల లోతులో, మెదక్లో అత్యధికంగా 15.52 మీటర్ల లోతులో భూగర్భజలాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మొత్తంగా 33 జిల్లాలకు 24 జిల్లాల్లో 5-10మీటర్ల లోతులో, మిగిలిన 8 జిల్లాల్లో 10-15 మీటర్ల లోతులో, ఒక జిల్లాలో 15 మీటర్లకు పైగా లోతులో భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నట్టు నివేదికలో పేర్కొన్నారు.