హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జల ప్రదాయిని.. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగా రాష్ట్రంలో భూగర్భ జలాల స్థాయి గణనీయంగా పెరిగింది. ప్రాజెక్టు ద్వారా బీళ్లకు నీళ్లు అందటమేకాకుండా భూగర్భజలాలు పైకి తన్నుకొస్తున్నాయి. ప్రాజెక్టు ఫలితంగా 18.25 లక్షల ఎకరాల నూతన కమాండ్ ఏరియాలో 125 టీఎంసీల భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చినట్టు భూగర్భ జలశాఖ నివేదిక వెల్లడించింది. రాష్ట్ర భూగర్భ జలశాఖ, కేంద్ర జల్శక్తి పరిధిలోని కేంద్ర భూగర్భ జలశాఖ సంయుక్తంగా 33 జిల్లాల పరిధిలో భూగర్భ జల మట్టం వివరాలను సేకరించి ‘డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్స్ తెలంగాణ స్టేట్’ పేరిట నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో కాళేశ్వరం ప్రాజెక్టు కింద ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త ఆయకట్టు (9 జిల్లాలు)లో 125 టీఎంసీల భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చాయని, అందులో 81 టీఎంసీలను వినియోగిస్తుండగా, 44 టీఎంసీలు మిగులు ఉంటున్నట్టు వివరించింది. మిషన్ కాకతీయ ద్వారా భూగర్భ జలమట్టం గతంకంటే 1 టీఎంసీ అదనంగా పెరిగిందని పేర్కొన్నది.
భూగర్భ జలాల వినియోగం కూడా భారీగా తగ్గింది. 2016-17 నివేదిక ప్రకారం హైదరాబాద్లో 341 శాతం భూగర్భజలాలను వినియోగించగా, అది 2019-20 నాటికి 97 శాతానికి తగ్గింది. మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు అందిస్తుండటం వల్ల బోర్లు, బావుల వాడకం తగ్గిపోయిందని నివేదిక తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నీటి సంరక్షణ చర్యల ఫలితంగానే భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు, చెక్డ్యామ్ల నిర్మాణం, ఇంకుడు గుంతల నిర్మాణం ఇలా అన్ని రకాలుగా తీసుకొన్న జాగ్రత్తల వల్లే ఇది సాధ్యమైంది. భూగర్భ జలాల వినియోగం సైతం గణనీయంగా తగ్గిపోయింది. శుభపరిణామం ఏమిటంటే కొన్ని ప్రాంతాల జలాల్లో ఉన్న ఫ్లోరైడ్, లెడ్ పరిమాణం తగ్గిపోయి శుద్ధ జలాలుగా మారుతున్నాయి.
–పండిత్ మద్నూరే, డైరెక్టర్, రాష్ట్ర భూగర్భ జలశాఖ