మహబూబ్నగర్/నాగర్కర్నూల్, ఫిబ్రవరి 13 : మద్దతు ధర కోసం పల్లి రైతులు కన్నెర్ర చేశారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంతోపాటు నాగర్కర్నూల్లో ఆందోళనకు దిగారు. మహబూబ్నగర్ మార్కెట్ యార్డు ఎదుట పల్లి బస్తాలను కాల్చివేశారు. వివరాలు ఇలా.. పల్లి రైతులు మంగళవారం ఉదయం మహబూబ్నగర్లోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయానికి చేరుకొని మద్దతు ధర ప్రకటించాలని వేడుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు టెండర్లు వేసి ధరలు నిర్ణయించారు. క్వింటా వేరుశనగకు గరిష్ఠంగా రూ.6,909 కాగా.. కనిష్ఠంగా రూ.4,005 ధర పలికింది. సోమవారం వరకు ధరలు కాస్త మంచిగానే ఉన్నా.. మంగళవారం ఒక్కసారిగా తగ్గడంతో ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ కార్యాలయం వద్దకు భారీగా చేరుకొని ఆందోళనకు దిగారు.
వ్యవసాయ మార్కెట్ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోగా.. కొందరు వ్యాపారులు వేరుశనగను సంచుల్లో నింపేందుకు సన్నద్ధమయ్యారు. ఆగ్రహించిన రైతులు సంచులను మార్కెట్ యార్డు బయటకు తీసుకొచ్చి కాల్చివేసి నిరసనను కొనసాగించారు. మార్కెట్ యార్డు నుంచి బోయపల్లి గేటు మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. చౌరస్తాలో భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఒక మాట.. ఇప్పుడు ఒక మాట చెబుతున్నదని మండిపడ్డారు.
అర్బన్ డిప్యూటీ తాసీల్దార్ దేవేందర్ ధర్నా వద్దకు చేరుకొని రైతులతో మాట్లాడారు. ధర కల్పిస్తామని నచ్చజెప్పి మార్కెట్ యార్డుకు తీసుకొచ్చారు. సాయంత్రం 6 గంటల నుంచి మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి బాలమణి, డీటీ దేవేందర్ రైతుల సమక్షంలో వ్యాపారులతో చర్చలు జరిపారు. ధర పెంపునకు వ్యాపారులు ససేమిరా అనడంతో రైతులు ఆందోళన మరింత ఉధృతం చేశారు. రాత్రి 9 వరకు చర్చలు జరగ్గా.. చివరకు క్వింటాకు రూ.100 పెంచుతామని వ్యాపారులు చెప్పగా రైతులు అయిష్టంగానే అంగీకరించారు. మార్కెట్ యార్డు వేరుశనగ రాసులతో నిండిపోవడంతో రైతులు బుధవారం మార్కెట్కు పల్లిని తీసుకురావొద్దని అధికారులు సూచించారు.
నాగర్కర్నూల్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో పల్లి రైతులు ధర్నా చేపట్టారు. మార్కెట్కు 1,700 క్వింటాళ్ల వేరుశనగను 201 మంది రైతులు విక్రయానికి తీసుకొచ్చారు. ఆశించిన ధర రాకపోవడంతో రైతు సంఘం నాయకులతో కలిసి ఆందోళనకు దిగారు. పల్లికి మద్దతు ధర కల్పించకుండా అధికారులు రైతును నట్టేట ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర కల్పించాలని వ్యవసాయ కార్యదర్శితో వాగ్వాదానికి దిగారు. మార్కెట్లో వ్యాపారులు కుమ్మక్కై తక్కువ ధర నిర్ణయించారని ఆరోపించారు. బహిరంగ మార్కెట్లో పల్లికి ఎంతో డిమాండ్ ఉన్నా ఇక్కడ మాత్రం ధర పెంచడం లేదని మండిపడ్డారు.