వనపర్తి : వనపర్తి జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు కారణంగానే వనపర్తి జిల్లాలో 4.40 మీటర్ల మేర భూగర్భజలాలు పెరిగాయని తెలిపారు. రాష్ట్రంలో అత్యధికంగా భూగర్భ జలాలు పెరిగిన జిల్లాగా వనపర్తికి గుర్తింపు లభించిందని పేర్కొన్నారు.
వనపర్తి జిల్లా కేంద్రంలో భూగర్భ జల విభాగం (ground water resources assesment) రూపొందించిన వనపర్తి జిల్లా భూజల వనరులు పుస్తకాన్ని విడుదల చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఇవాళ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశీష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. దశాబ్దాల పెండింగ్ ప్రాజెక్టులను రెండేండ్లలోనే రన్నింగ్ ప్రాజెక్టులుగా మలిచామని గుర్తు చేశారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదటి దశ వచ్చే ఏడాది నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు. ఒకప్పుడు ప్రాజెక్టులున్నా నీళ్లు లేని దుస్థితి.. నేడు రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా దర్శనం ఇస్తున్నా ఒడిసి పట్టుకోవడానికి రిజర్వాయర్లు లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. దాదాపు ఐదు లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద కనీసం నాలుగు టీఎంసీలు నీళ్లు నిలుపుకునే రిజర్వాయర్లు కూడా గత ప్రభుత్వం నిర్మించలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో కాలువల ద్వారా చెరువులు, కుంటలు నింపే అవకాశం ఇవ్వడం మూలంగా నేడు భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు. ఎనిమిదేళ్ల కేసీఆర్ ముందుచూపు ఫలితంగానే సాగునీటి వసతి మూలంగా పల్లెలు పచ్చబడి వలసలు ఆగిపోయాయని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.