హైదరాబాద్ : గోదావరి నది యాజమాన్య బోర్డు (GRMB) సమావేశం మంగళవారం జరుగనున్నది. హైదరాబాద్లోని జలసౌధలో ఉదయం 10.30 గంటలకు చైర్మన్ ఎంకే సిన్హా అధ్యక్షతన బోర్డు సమావేశం కానున్నది. ఈ సందర్భంగా కడెం-గూడెం ఎత్తిపోతల పథకం, మెండికుంటవాగు ఎత్తిపోతల పథకాల అనుమతుల ప్రక్రియపై చర్చించనున్నారు. అలాగే పెద్దవాగు ఆనకట్ట ఆధునికీకరణ, రాష్ట్రాల సరిహద్దుల్లో గోదావరిపై టెలిమెట్రీ వ్యవస్థల ఏర్పాటు, ఉమ్మడి రాష్ట్రం కాలంలో గోదావరిలో నీటి లభ్యతపై అధ్యయనానికి కన్సల్టెన్సీ నియామకం, బోర్డు నిర్వహణ, నిధులు, ఉద్యోగులు, సీడ్ మనీ, వసతి తదితర అంశాలపై సైతం చర్చ జరుగనున్నది.
కడెం-గూడెం ప్రాజెక్టుపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. కడెం ప్రాజెక్టుకు అవసరమైన నీటి లభ్యత ఉందని, గూడెం ఎత్తిపోతల పథకం నిర్మించాల్సిన అవసరం లేదంటూ గత ఆగస్టులో బోర్డుకు ఏపీ లేఖ రాసింది. అయితే కడెం ప్రాజెక్టులో పూడిక చేరడంతో మూడు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిందని, దీంతో ప్రత్యామ్నాయ ప్రాజెక్టును చేపట్టినట్లు తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు. ఈ అంశంపై ఇవాళ భేటీలో వాడివాడీగా చర్చ జరిగే అవకాశం ఉన్నది. మరో వైపు గోదావరిలో నీటి లభ్యతపై స్పష్టత లేకపోవడం, తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలను ఇప్పటి వరకు నిర్ణయించకపోవడంతో రెండు రాష్ట్రాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అనుమతి జారీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
గోదావరిలో 75శాతం డిపెండబిలిటీ ఆధారంగా 3216 టీఎంసీల జలాల లభ్యత ఉందని, ఏపీకి 1360 టీఎంసీల లభ్యత ఉందని వ్యాప్కోస్ అధ్యయనంలో తేలిందని ఏపీ వాదిస్తున్నది. తెలంగాణకు 1480 టీఎంసీల లభ్యత ఉందని, ఏపీకి 1486.55 టీఎంసీల లభ్యత ఉందని తెలంగాణ వాదిస్తున్నది. ఈ క్రమంలో గోదావరిలో వాస్తవ నీటి లభ్యతపై జాతీయ సంస్థతో అధ్యయనం చేయించాలని బోర్డు ప్రతిపాదిస్తుండగా.. ఈ అంశంపై మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.