హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఖజానా నింపుకోవడమే పరమావధిగా వ్యవహారిస్తున్న రేవంత్రెడ్డి సర్కార్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)కు ఇరువైపులా భారీగా భూ సమీకరణ చేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఉప్పల్ భగాయత్, బుద్వేల్, మోకిల ప్రాజెక్టుల ద్వారా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం రావడంతో అదే నమూనాలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలో అడ్డగోలుగా భూములను గుంజుకోవాలని చూస్తున్నది.
హెచ్ఎండీఏ చేపట్టే భూసేకరణను ఇప్పటికే రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో డిప్యూటీ సీఎం నేతృత్వంలోని క్యాబినెట్ సబ్కమిటీ ఇటీవల ల్యాండ్ పూలింగ్, మానిటైజేషన్ పాలసీ విస్తరణకు ఆమోదం తెలిపింది. తద్వారా ఓఆర్ఆర్ జంక్షన్ల సమీపంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ భూములను అభివృద్ధి పేరిట విక్రయించి ఆదాయం పెంచుకోవాలని రేవంత్రెడ్డి సర్కార్ భావిస్తున్నది. ల్యాండ్ పూలింగ్ నిబంధనల ప్రకారం ్రప్రైవేట్ వ్యవసాయ భూములను సేకరించి లేఅవుట్లుగా మార్చిన తర్వాత ఆ భూముల యజమానులకు 60% వాటా ఇస్తామని గతంలో ప్రభుత్వం చెప్పడంతో అప్పుడే వాటి యజమానులు వ్యతిరేకించారు. తమకు ఇచ్చే వాటాను పెంచాలని డిమాండ్ చేశారు. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా పాత నిబంధనలతోనే బలవంతపు ల్యాండ్ ఫూలింగ్కు సిద్ధమవుతున్నది.
ఓఆర్ఆర్కు ఇరువైపులా ల్యాండ్ పూలింగ్
ప్రభుత్వ ఆదేశాలతో హెచ్ఎండీఏ అధికారులు ఇప్పటికే ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లో భూముల వేట ప్రారంభించారు. ప్రైవేట్ భూములతోపాటు అసైన్డ్, ఇనామ్, లావాణీ భూములను సైతం వదలకుండా సేకరించాలని క్యాబినెట్ సబ్కమిటీ ఆదేశించడంతో ఓఆర్ఆర్కు ఇరువైపులా 50 నుంచి 100 ఎకరాల విస్తీర్ణంలో ల్యాండ్ పూలింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తొలి విడుతలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో దాదాపు 4వేల ఎకరాల అత్యంత విలువైన అసైన్డ్, ప్రభుత్వ భూములను సేకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇవి కాకుండా ఓఆర్ఆర్ వెంబడి చౌటుప్పల్, కందుకూర్, శంకర్పల్లి తదితర ప్రాంతాల్లో ఏకంగా 10 వేల ఎకరాల విస్తీర్ణంలో మూడు కొత్త ల్యాండ్ డెవలప్మెంట్ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ప్రభుత్వం స్కెచ్ వేస్తున్నది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలా వ్యవహరిస్తున్నదని రైతులు, భూ యజమానులు మండిపడుతున్నారు.