తుర్కపల్లి, సెప్టెంబర్ 12: గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ను త్వరలో యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో ప్రారంభించనున్నట్టు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి తెలిపారు. దేశ, విదేశాలకు చెందిన వివిధ కంపెనీలు తుర్కపల్లిలో నెలకొల్పనున్నట్టు వెల్లడించారు. మంగళవారం తుర్కపల్లిలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ను నెలకొల్పనున్న సర్వే నంబర్ 72లో 42 మంది భూ నిర్వాసితులకు రూ.7.35 కోట్ల పరిహారం అందించారు. నృసింహసాగర్ జలాశయం 16వ ప్యాకేజీ ప్రధాన కాల్వ నిర్మాణంలో భాగంగా మామిడికుంట తండాలో ఇండ్లు కోల్పోయిన 80 కుటుంబాలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.6.08 కోట్ల విలువగల చెక్కులు పంపిణీ చేశారు. వీరారెడ్డిపల్లి, ముల్కలపల్లి గ్రామాలకు చెందిన 11 మంది రైతులకు రీ అసైన్డ్ పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడారు. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం రెండేండ్లు కష్టపడ్డామని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను ఒప్పించి తీసుకొచ్చినట్టు తెలిపారు.