ఆదిలాబాద్ : ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహంతో, వినూత్న కార్యక్రమాలతో దూసుకువెళ్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఈ యేడాది మరింత విభిన్నంగా మొదలు కాబోతోంది. నాల్గొవ యేట అడుగు పెట్టి, దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఈయేడు వన్ మిలియన్ ప్లాంటేషన్ – ఇన్ వన్ అవర్ (ఒక గంటలో పది లక్షల మొక్కలు) కార్యక్రమాన్ని తీసుకుంటోంది. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చన స్ఫూర్తితో ఈ నెల 4న మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న 58వ పుట్టిన రోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 2019లో టర్కిలో జరిగిన ఒక గంటలో మూడు లక్షల మూడు వేల మొక్కలు నాటే కార్యక్రమం గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించింది. దానికి మిన్నగా ఒక్క గంటలోనే పది లక్షలు మొక్కలు నాటి గిన్నిస్ రికార్డును తిరగరాయాలని నిర్వాహకులు భావిస్తున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గత రెండు వారాలుగా పనులు ముమ్మరం అయ్యాయి. అదిలాబాద్ అర్బన్, రూరల్ ఏరియాల్లో కలిపి లక్షలాది మొక్కల కోసం గుంతలు తీసే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మొక్కలు, ప్లాంటింగ్ మెటీరియల్ సిద్దమౌతోంది.
అదిలాబాద్ రూరల్ బేల మండలంలో రెండు లక్షల మొక్కలు, అర్బన్ లో 45 వేల నివాసాల పరిధిలో ఒక లక్షా ఎనభై వేల మొక్కలు, జిల్లా కేంద్రంలో ఆర్ అండ్ బీ రోడ్డుకు ఇరవైపులా ఒక లక్షా ఇరవై వేల మొక్కలు, ఇక దుర్గానగర్ ప్రాంతంలోని క్షీణించిన అటవీ ప్రాంతమైన 200 ఎకరాల్లో యాదాద్రి మోడల్ లో (మియావాకీ పద్దతిలో) ఐదు లక్షల మొక్కలు నాటనున్నారు. సుమారు 25 వేల మంది టీఆర్ఎస్ కార్యకర్తలకు తోడు, అదిలాబాద్ వాసులు ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేయనున్నారు.
కరోనా ఉధృతి వల్ల పర్యావరణం, ప్రకృతి ప్రాధాన్యత మరోసారి అందరికీ తెలిసివచ్చిందని, మన పరిసరాలు, రాష్ట్రం, దేశాన్ని కూడా పచ్చగా చేయాలన్న సంకల్పమే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అన్నారు ఎంపీ సంతోష్ కుమార్. ఈ సీజన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రతీ ఒక్కరూ పాల్గొన్ని, మూడు మొక్కలు నాటడంతో పాటు, మరో ముగ్గురిని నామినేట్ చేయాలని, నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతలు తప్పకుండా తీసుకోవాలని ఆయన కోరారు.