గ్రీన్ ఇండియా చాలెంజ్లో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. పాలమూరు స్వయం సహాయక సంఘాల మహిళలు ఘనత సాధించారు. పది రోజుల్లోనే 2 కోట్లకుపైగా విత్తన బంతులు రూపొందించి ఔరా అనిపించారు. విత్తన బంతులతో ఇంగ్లిష్లోనే అతి పెద్ద వాక్యం రాసి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఈ ఘనతను లిఖించుకున్నారు.
హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ)/మహబూబ్నగర్(నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్.. కొత్త శిఖరాన్ని చేరింది. ఈ కార్యక్రమ స్ఫూర్తితో మహబూబ్నగర్ జిల్లా స్వయం సహాయక సంఘాల మహిళలు మంత్రి శ్రీనివాస్గౌడ్, కలెక్టర్ ఎస్ వెంకటరావు మార్గదర్శకత్వంలో కేవలం 10 రోజుల్లోనే 2.08 కోట్ల సీడ్బాల్స్ (విత్తనబంతులు)ను రూపొందించారు. అంతేకాకుండా సోమవారం కేవలం రెండు గంటల్లో 73,918 బంతులతో ఇంగ్లిష్లో అతిపెద్ద వాక్యం రూపొందించి, గ్రీన్ ఇండియా చాలెంజ్ను కొత్త శిఖరాలకు చేర్చారు. సోమవారం గ్రీన్ ఇండియా చాలెంజ్ రూపకర్త, ఎంపీ సంతోష్కుమార్, మంత్రి శ్రీనివాస్గౌడ్, మహబూబ్నగర్ ఎంపీ మన్నే శ్రీనివాస్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై సీడ్బాల్స్ను వెదజల్లే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వీటిని మహబూబ్నగర్ సమీపంలో ఉన్న దేశంలోనే అతి పెద్దదైన కేసీఆర్ ఎకో అర్బన్ పార్కులో వెదజల్లారు. దీంతోపాటు మహబూబ్నగర్లోని రైల్వే కమ్యూనిటీ హాల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 73,918 బంతులతో ‘TWO CRORE SEED BALLS MADE AND PLANTED BY SHG WOMEN TRANSFORM MAHABUB NAGAR IN TO HETERO GREEN BELT’ (టూ క్రోర్ సీడ్ బాల్స్ మేడ్ అండ్ ప్లాంటెడ్ బై ఎస్హెచ్జీ వుమెన్ ట్రాన్స్ఫామ్ మహబూబ్నగర్ ఇన్ టు హెటిరో గ్రీన్ బెల్ట్) అనే వాక్యాన్ని తయారుచేశారు. ఉదయం 10:40 గంటల నుంచి మధ్యాహ్నం 12:35 గంటల మధ్య (గంట 55 నిమిషాల్లో) ఈ వాక్యాన్ని తయారుచేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. ఈ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయగా, వివిధ దేశాల్లో ఉన్న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు పరిశీలించారు. అనంతరం పాలమూరు మహిళలు గిన్నిస్రికార్డ్ సాధించినట్టు సంస్థ ప్రతినిధి రిషినాథ్ అధికారికంగా ప్రకటించారు. పాలమూరు జిల్లా మహిళా సమాఖ్య, డీఆర్డీఏ, మెప్మా, మంత్రి శ్రీనివాస్గౌడ్, కలెక్టర్ వెంకట్రావు, హెటిరో గ్రూప్ పేరిట గిన్నిస్రికార్డు నమోదైనట్టు చెప్పారు. ఈ రికార్డును గ్రీన్ ఇండియా చాలెంజ్కు-ఎంపీ సంతోష్కుమార్కు అంకితం చేస్తున్నట్టు మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్పవార్, సీతారామారావు, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, డీసీసీబీ ఉపాధ్యక్షుడు వెంకటయ్య, వైస్ చైర్మన్ గణేశ్, డీఆర్డీవో యాదయ్య, మెప్మా పీడీ శంకరాచారి, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు శారద, నాగమల్లిక, గ్రీన్ ఇండియా ప్రతినిధులు రాఘవ, వెంకటేశ్, మాజీ మార్కెట్ చైర్మన్ రాజేశ్వర్, డీఎఫ్వో గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్కు అంకితం: మంత్రి శ్రీనివాస్గౌడ్
గ్రీన్ ఇండియా చాలెంజ్తో దేశమంతా పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేస్తున్న ఎంపీ సంతోష్కుమార్కు తాజా గిన్నిస్ రికార్డును అంకితం ఇస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రకటించారు. ఆయన స్ఫూర్తితోనే ఈ సంవత్సరం జిల్లాలో గిన్నిస్ రికార్డు సాధించాలన్న పట్టుదలతో అధికారులు పనిచేసినట్టు తెలిపారు. పాలమూరుకు ప్రపంచ ఖ్యాతిని తీసుకొచ్చిన మహిళా సంఘాల సభ్యులకు అభినందనలు తెలియజేశారు.
పాలమూరు మహిళలు అద్భుతం చేశారు: ఎంపీ సంతోష్
మహబూబ్నగర్ జిల్లా మహిళలు గిన్నిస్రికార్డు సాధించడం పట్ల ఎంపీ సంతోష్కుమార్ సంతోషం వ్యక్తంచేశారు. పాలమూరు మహిళలు అద్భుతం చేశారని, పచ్చదనాన్ని పెంపొందించేందుకు 2.08 కోట్ల విత్తన బంతులను తయారుచేయడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నానని ట్వీట్ చేశారు. మంత్రి శ్రీనివాస్గౌడ్, కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు కృషిని ప్రత్యేకంగా అభినందించారు.
‘గిన్నిస్బుక్’లో ఎలా నమోదుచేస్తారు?
ప్రపంచరికార్డుల నమోదుకు ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ను ప్రామాణికంగా తీసుకుంటారు. ఎవరైనా కొత్త ప్రయత్నం చేసి, తమ పేరును గిన్నిస్బుక్లో నమోదు చేసుకోవాలంటే ముందుగా.. వెబ్సైట్లో పేరు, ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ తదితర వివరాలతో ‘రిజిస్టర్’ చేసుకోవాలి. ఆ తర్వాత దరఖాస్తు ఫారం వస్తుంది. ప్రాథమిక వివరాలతోపాటు ఏ రంగంలో.. ఏ అంశంలో రికార్డును నెలకొల్పాలనుకుంటున్నామో చెప్తే, ప్రస్తుతం ఉన్న ప్రపంచరికార్డు వివరాలు కనిపిస్తాయి. చివరగా ‘ఐప్లె ఫర్ న్యూ రికార్డ్ టైటిల్’ అనే ఆప్షన్ను ఎంచుకొని, సబ్మిట్ చేయాలి. ఈ దరఖాస్తును సంస్థ ప్రధాన కార్యాలయంలోని ‘రికార్డ్స్ మేనేజ్మెంట్ టీమ్’ పరిశీలిస్తుంది. అర్హమైనదిగా భావిస్తే దరఖాస్తును ఆమోదిస్తారు. తర్వాత సంస్థ నియమ నిబంధనల ప్రకారం గిన్నిస్రికార్డు కోసం ప్రయత్నించవచ్చు. రికార్డు సృష్టించే సమయంలో ఎలాంటి ఆధారాలు సమర్పించాలో ముందుగానే జాబితా మెయిల్ చేస్తారు. ఆ మేరకు ఆధారాలను సంస్థకు పంపాల్సి ఉంటుంది. ఒకవేళ రికార్డు సృష్టించే సమయంలో గిన్నిస్ సంస్థ నుంచి ప్రత్యేకంగా పర్యవేక్షకుడు (జడ్జి) ఉండాలని భావిస్తే.. సంస్థకు మెయిల్ ద్వారా విన్నవించవచ్చు. అప్పుడు గిన్నిస్ ప్రతినిధులు నేరుగా వచ్చి లేదా ఆన్లైన్లో లైవ్ కవరేజీ ద్వారా పరిశీలిస్తారు. ఆధారాలను, ఇతర వివరాలను సంస్థకు పంపుతారు. సంస్థ ప్రతినిధులు ఆ ఆధారాలను నిశితంగా పరిశీలించిన అనంతరం కొత్త రికార్డు నెలకొల్పారో లేదో నిర్ధారిస్తారు. కొత్త రికార్డు నెలకొల్పితే.. ఈ మేరకు ధ్రువపత్రం అందజేస్తారు.